హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్కు, ఆ పార్టీ నేతలకు ఒక విధానమంటూ లేదని, కేవలం పనిగట్టుకొని ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప మరేమీ లేదని మరోసారి తేటతెల్లమైంది. కాంగ్రెస్ విధాన రాహిత్యం అసెంబ్లీ వేదికగా బయల్పడింది. ఫసల్బీమా యోజనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో నష్టపోయిన పంటలకు పరిహారం అందించేందుకు కేంద్రం ఫసల్బీమా యోజనను ప్రవేశపెట్టింది. ఆ పథకం నిరర్ధకమని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు దానిని అమలు చేయడానికి నిరాకరిస్తున్నాయి.
తొలుత ఈ పథకాన్ని అమలు చేస్తామని అంగీకరించిన రాష్ర్టాలు కూడా ఆ తరువాత వైదొలిగాయి. ఇక ఈ పథకంపై భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్గాంధీనే స్వయంగా విమర్శలు గుప్పించారు. పథకం ద్వారా ఒక్క రైతుకు కూడా పంటల బీమా అందడంలేదని కేంద్రంపై విరుచుపడ్డారు. కానీ అందుకు భిన్నంగా కాంగ్రెస్ నేత శ్రీధర్బాబు అసెంబ్లీలో వ్యాఖ్యానించడం గమనార్హం. వరదలపై చర్చ సందర్భంగా శ్రీధర్బాబు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభు త్వం ఫసల్బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం లేదని, అదే చేసివుంటే రైతులకు ప్రయోజనం చేకూరేదని ఆ పథకానికి కితాబివ్వడం కొసమెరుపు.