YS Sharmila | స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖాయమైంది. ఆమె చేరిక కేవలం లాంఛనమే. ఈ వారంలోనే ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు కాంగ్రెస్ వర్గాల విశ్వసనీయ సమాచారం. ఆమెకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు షర్మిల భర్త అనిల్కుమార్తో ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు చర్చించినట్టు సమాచారం. ఫైనల్గా షర్మిలతో కూడా ఈ విషయం మరోసారి చర్చించాక ఏఐసీసీసీ అధికారికంగా ప్రకటిస్తుందని సమాచారం. కర్ణాటక, తెలంగాణలో సాధించిన విజయాల స్ఫూర్తితో ఏపీలోనూ పార్టీని బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ వ్యూహరచన చేస్తున్నదని, ఇందులో భాగంగానే షర్మిలకు పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది. ఏపీ కాంగ్రెస్ కమిటీ పగ్గాలు చేపట్టడానికి షర్మిల ఇప్పడే అంగీకరించని పక్షంలో తొలుత పార్టీ స్టార్ క్యాంపెయినర్గా నియమించి, ఆ తర్వాత పార్టీ పగ్గాలు అప్పగించాలన్నది పార్టీ వ్యూహమని చెప్తున్నారు.
ఆంధ్రలో పూర్వవైభవమే టార్గెట్
ఇప్పటికే ఏపీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులను కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలు ఢిల్లీకి పిలిపించుకొని షర్మిల చేరిక, పార్టీ బాధ్యతల అప్పగింత, సార్వత్రిక ఎన్నికలపై విస్తృతంగా చర్చించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తమతో షర్మిల చేరికపై చర్చించిన విషయాన్ని ఏపీపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు, జేడీ శీలం మీడియాకు వెల్లడించారు. పార్టీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ సీనియర్లను కూడా ఘర్వాపసీ నినాదంతో తిరిగి పార్టీలోకి తీసుకరాబోతున్నట్టు రుద్రరాజు తెలిపారు. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డితో కూడా చర్చిస్తున్నామని, చాలామంది సీనియర్లు కూడా తిరిగి పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారని ఆయన చెప్పడం గమనార్హం.
ఫలించిన డీకే మంత్రాంగం
షర్మిలను తిరిగి కాంగ్రెస్లోకి తీసుకొనిరావడం, ఆమె పార్టీ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనానికి ఒప్పించడం వెనుక కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మంత్రాంగం ఫలించినట్టు చెప్తున్నారు. దివంగత ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి కుటుంబానికి డీకే సన్నిహితుడు. ఆ చొరవతోనే కాంగ్రెస్ పెద్దలను ఒప్పించి, ఏపీలో షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించడానికి ఆయన రంగం సిద్ధం చేసిన విషయం బహిరంగమే. ఆంధ్రలో వైఎస్సార్కు ఉన్న పేరును ఉపయోగించుకొని ఆయన రాజకీయ వారసురాలిగా షర్మిల ద్వారా అక్కడ కాంగ్రెస్ను బలోపేతం చేసుకుందామన్న డీకే శివకుమార్ వ్యూహానికి పార్టీ పెద్దలు అంగీకరించిన తర్వాతనే ఆమె చేరికకు గ్రీన్ సిగ్నల్ పడినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. పైగా షర్మిల సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాతీయ రాజకీయాల్లో బీజేపీతో సఖ్యతగా ఉంటున్నారు. ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్యనే పోటీ ఉన్నది. కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలకు అక్కడ చోటు లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో ఏపీలో షర్మిల ద్వారా వైసీపీని బలహీనపరిచి కాంగ్రెస్ను బలోపేతం చేయడం మరో వ్యూహం. కాగా సీఎం జగన్కు రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబుతో కూడా కాంగ్రెస్ లోపాయికారి సంబంధాలు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ కాంగ్రెస్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న డీకే.. ఇటీవల బెంగళూరు ఎయిర్పోర్టులో చంద్రబాబుతో ఏమి మాట్లాడారన్నది హాట్టాపిక్గా మారింది. జగన్ను రాజకీయంగా ఎదుర్కోవడానికి షర్మిలను తమ పార్టీ రంగంలోకి దింపుతున్న విషయాన్ని చంద్రబాబుతో డీకే చర్చించి ఉంటారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. షర్మిలను ఇప్పటికిప్పుడు ఏపీ రాజకీయాల్లోకి తీసుకొనిరావడం వల్ల అక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలడం వల్ల సీఎం జగన్కే మేలు చేస్తుందన్నది ఒక వాదన కాగా, వైసీపీకి పడే ఓట్లను చీల్చే అవకాశం ఉందనేది మరో వాదన.
కర్ణాటక నుంచి రాజ్యసభకు
సార్వత్రిక ఎన్నికలతోపాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోగలిగే స్థితిలో లేకపోవడంతో 2029 ఎన్నికలే టార్గెట్గా షర్మిలను ఇప్పటినుంచే రంగంలోకి దింపాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్టు తెలిసింది. షర్మిలను 2029 ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ఇప్పటి నుంచే ప్రొజెక్టు చేయాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటినుంచే ఏపీలో గ్రౌండ్ ప్రిపేర్ చేయాలన్నది కాంగ్రెస్ వ్యూహమని చెప్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో కడప నుంచి షర్మిలను ఎంపీగా పోటీ చేయించడం ద్వారా ఏపీలో పార్టీకి ఊపు తీసుకరావచ్చు అన్నది కాంగ్రెస్ వ్యూహం. ఒకవేళ ఆమె కడప నుంచి పోటీకి అంగీకరించని పక్షంలో కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించేలా కాంగ్రెస్ పెద్దలు ప్లాన్-బీ కూడా సిద్ధం చేసినట్టు ఈ వర్గాల సమాచారం.