హైదరాబాద్, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో గెలుపుపై నమ్మకంతో 4వ తేదీన క్యాబినెట్ భేటీ ఉంటుందని సీఎం కేసీఆర్ ధైర్యంగా ప్రకటిస్తే, ఫలితాలపై నమ్మకం కొరవడిన కాంగ్రెస్లో అలజడి మొదలైంది. ఎమ్మెల్యే అభ్యర్థులను కర్ణాటక తరలించే ఏర్పాట్లలో తలమునకలైంది. అభ్యర్థులపై అపనమ్మకం, క్యాంపు రాజకీయాలు, డీకే శివకుమార్ పెత్తనం, గెలుపుపై ధీమా లేకపోవడం.. ఇలా పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్కు అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్పోల్ ఫలితాలను ఆ పార్టీ కీలక నేతలు కూడా విశ్వసించడం లేదని తెలిసింది. ఓటరు తీర్పుపై ఎవరూ అంచనా వేసే పరిస్థితి లేదని, అలాంటప్పుడు ఎగ్జిట్పోల్ ఫలితాలను గుడ్డిగా నమ్మే పరిస్థితి లేదని అంటున్నారు. వాస్తవ ఫలితాలు, ఎగ్జిట్ పోల్ ఫలితాలకు భిన్నంగా ఉంటాయనే అభిప్రాయం కాంగ్రెస్లో వ్యక్తమవుతున్నది.
కర్ణాటక తరలించే యోచన
ఫలితాలు వెల్లడైన మరుక్షణమే ఎమ్మెల్యేలను ప్రత్యేక విమానాలు, బస్సుల ద్వారా కర్ణాటక తరలించేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తున్నది. ఇందుకోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఫలితాలు వెల్లడి కాగానే హైదరాబాద్ రావాలని ఆదేశించింది. దీనికితోడు ప్రతి లెక్కింపు కేంద్రంలోనూ అభ్యర్థికి తోడుగా ఢిల్లీ నుంచి వచ్చిన దూత కాపలా ఉండేలా ఏర్పాట్లు చేసింది.
డీకే చేతుల్లోకి తెలంగాణ కాంగ్రెస్
ఫలితాలకు ముందే తెలంగాణ కాంగ్రెస్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేతుల్లోకి వెళ్లిపోయింది. రేవంత్రెడ్డి, ఉత్తమ్, భట్టి, కోమటిరెడ్డి.. ఇలా కీలక నేతలందరూ డమ్మీ అయిపోయారు. ఇప్పటికే కర్ణాటక నుంచి వచ్చి హైదరాబాద్లో మకాం వేసిన డీకే.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ, ఎమ్మెల్యేల తరలింపుపై దృష్టిసారించారు. మెజారిటీ మార్కుకు కాస్తా అటూ ఇటుగా సీట్లు గెలిస్తే.. ఎమ్మెల్యే అభ్యర్థులను వెంటనే కర్ణాటక తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం కర్ణాటకలో రిసార్టులు, ఫైవ్స్టార్ హోటళ్లను బుక్ చేసినట్టు తెలిసింది.