Congress | హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మన్నె క్రిశాంక్ను ఇంటికొచ్చి కొడుతా.. అంటూ కాంగ్రెస్ నాయకుడు ప్రెస్మీట్ పెట్టి మరీ వార్నింగ్ ఇవ్వడం రాజకీయవర్గాల్లో కలకలం రేపింది. సీఎం రేవంత్రెడ్డిని విమర్శిస్తే పార్టీ కండువా పక్కన పడేసి ఇంటికి వచ్చి కొడుతా.. అని గాంధీభవన్లో గురువారం ప్రెస్మీట్ పెట్టి మెట్టు సాయికుమార్ హెచ్చరించారు. ఒక పార్టీకి చెందిన వ్యక్తిని మరో పార్టీకి చెందిన నాయకుడు ఈ విధంగా హెచ్చరించడం మునుపెన్నడూ లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలపై ఎక్కడో ఒకచోట దాడులు జరుగుతున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న తరుణంలో ప్రెస్మీట్ మరీ ఇంటికి వచ్చి కొడుతానని వార్నింగ్ ఇవ్వడం పట్ల పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. కాగా, సీఎం రేవంత్రెడ్డిపై సామాజిక మధ్యమాల్లో పోస్టు పెట్టారన్న నెపంతో మన్నె క్రిశాంక్ ఫోన్ను పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. పోస్టు పెట్టినందుకే కేసు పెట్టిన పోలీసులు.. ప్రతిపక్ష పార్టీ నేతను ఇంటికొచ్చి మరీ కొడుతా అంటూ బహిరంగంగా ధమ్కీ ఇచ్చిన నాయకుడిపై ఏం చర్య తీసుకుంటారో చూడాలి.