హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): దేశమంతా కరెంట్ కటకట ఉన్నా ముఖ్యమంత్రి కేసిఆర్ ముందుచూపు వల్ల రాష్ట్రంలో విద్యుత్తు కోతలు లేవని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. రైతులు, పేదలు రెండు కండ్లుగా సంక్షేమ పాలన అందిస్తూ రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్వన్గా నిలిపిన దార్శనికుడు సీఎం కేసీఆర్ అని మంత్రి అన్నారు. సీఎం కేసీఆర్ పథకాలకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ నేతలు సోమవారం హైదరాబాద్లో మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
ముఖ్యమంత్రి కేసిఆర్ జనరంజక పాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొప్పెల సాయిరెడ్డితోపాటు 20 మంది కీలక నేతలు టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్లో చేరినవారికి మంత్రి ప్రశాంత్రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారికి తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాలొండ నియోజకవర్గంలో వందల కోట్లతో అభివృద్ధి జరుగుతున్నదని, రూ.100 కోట్లతో చెక్డ్యాంలు నిర్మించి ఏండ్ల తరబడి ఉన్న సాగునీటి గోసను తీర్చిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కిందన్నారు.
అలాగే ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా కాకతీయ, వరద కాలువలు మండు వేసవిలో కూడా నిండు కుండలా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ చొరవతో రాష్ట్రంలో విదేశీ కంపెనీలు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి, లక్షల మంది తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నాయని మంత్రి వేముల గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మెండోర సర్పంచ్ మచ్చర్ల రాజారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నవీన్ గౌడ్, ఉపాధ్యక్షుడు బడాల గంగారెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.