Mahabubnagar | మహబూబ్నగర్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/భూత్పూర్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్లో రైతు ఆత్మహత్యకు రాజకీయ రంగు పులుముతున్నారు. సీఎం జిల్లాలో రైతు బలవన్మరణాన్ని పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ నాయకులు విఫలయత్నం చేశారు. మృతుడి భార్య ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తుంటే, – శ్రీశైల (ఆత్మహత్య చేసుకున్న రైతు భార్య), మదిగట్ల, మహబూబ్నగర్ జిల్లా విచారణకు వచ్చిన అధికారుల బృందం మాత్రం కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడం గమనార్హం. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం మద్దిగట్లకు చెందిన రైతు శ్రీశైలం(30) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవటంపై శనివారం ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైంది. దీంతో ఆత్మహత్యపై విచారణ చేపట్టాలని కలెక్టర్ రవినాయక్ ఆదేశించటంతో భూత్పూర్ తహసీల్దార్ రాజు, వ్యవసాయ శాఖాధికారి మురళీధర్, ఎస్సై శ్రీనివాసులు రైతు శ్రీశైలం ఇంటికి వెళ్లి చుట్టుపక్కల వారిని విచారించారు.
అనంతరం రైతు పొలాన్ని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కడుపునొప్పి భరించలేక తన భర్త ఆత్మహత్య చేసుకొన్నాడంటూ మృతుడి భార్య శ్రీశైల స్టేట్మెంట్ ఇచ్చారని తహసీల్దార్ రాజు వెల్లడించారు. మృతుడి పొలానికి కూడా వెళ్లి పరిశీలించామని, పంటను హార్వెస్టర్తో కోశారని వివరించారు. మృతుడి భార్య, గ్రామస్థుల స్టేట్మెంట్ల ఆధారంగా జిల్లా కలెక్టర్కు నివేదిక పంపిస్తానని పేర్కొన్నారు. ఎట్టకేలకు రైతు ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించగా, బంధువులు అంత్యక్రియలు పూర్తిచేశారు.
మద్దిగట్లలో రైతు ఆత్మహత్య చేసుకున్న విషయం ‘నమస్తే తెలంగాణ’లో రావడంతో గ్రామంలోని కొందరు కాంగ్రెస్ నేతలు హడావుడి చేశారు. రైతు ఆత్మహత్య విషయం ప్రభుత్వానికి మచ్చగా మారుతుందని, అలా జరగకుండా మేనేజ్ చేయాలని వారిని ఆదేశించినట్టు తెలిసింది. దీంతో నిజానిజాలు తెలుసుకొనేందుకు వెళ్లిన ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధుల వెంటే కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. ‘నమసే తెలంగాణ’ బృందానికి మృతుడి చుట్టుపక్కలవారంతా అప్పుల బాధతోనే శ్రీశైలం ఆత్మహత్య చేసుకున్నాడని ముక్తకంఠంతో వెల్లడించారు. మృతుడి భార్య కూడా అప్పులబాధ తాళలేకే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. ఇద్దరు పిల్లలను అనాథలుగా చేసి వెళ్లిపోయాడని భోరున విలపించారు. తన పిల్లలు చిన్నవాళ్లు అని, వాళ్లను ఎలా పోషించాలో తెలియటం లేదంటూ కన్నీరుమున్నీరయ్యారు. మృతుని భార్యతో, స్థానికులతో నమస్తే తెలంగాణ బృందం మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ నాయకులు నిఘా పెట్టారు.
రైతు ఆత్మహత్య చేసుకోలేదని అక్కడున్నవారిని మార్చే ప్రయత్నం చేశారు. అధికారులు వచ్చినప్పుడూ వారి వెంటే ఉండి కావాల్సిన రీతిలో సమాచారం ఇప్పించి స్టేట్మెంట్లపై సంతకాలు పెట్టించినట్టు కొందరు గ్రామస్థులు ఆరోపించారు. సీఎం సొంత జిల్లా కావటంతోనే రైతు ఆత్మహత్యను కప్పిపెట్టేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నించిందని విమర్శలు వెల్లువెత్తాయి. ఆత్మహత్య చేసుకొంటే డబ్బులు రావని, కడుపునొప్పితో చనిపోతే రైతు బీమా వస్తుందని, ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల సాయం ఇస్తామని రైతు కుటుంబాన్ని ఒప్పించారని గ్రామస్థులు తెలిపారు.
మరోవైపు శ్రీశైలం పొలం ఎండిపోయినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. కొత్తగా బోరు వేసిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. మరో బోరులో ఫ్లషింగ్ చేసినా అందులో నీళ్లు రాలేదు. మరోచోట డ్రిల్లింగ్ చేయించినా అదే పరిస్థితి. కానీ అధికారులు మృతుడి పొలం బాగానే ఉన్నదని, కోత దశకు రావటంతో వరి పంటను హార్వెస్టర్తో కోశారని చెప్పడం గమనార్హం. అలాంటప్పుడు రైతు పొలంలో పండిన ధాన్యం ఎక్కడున్నది? ఆ పంటను ఎవరికి అమ్మారు? రసీదులు ఉన్నాయా? అంటే ఈ ప్రశ్నలకు అధికారుల వద్ద జవాబే లేదు.
మాకు రెండెకరాల పొలముంది. దానిపై ఇప్పటికే రూ.5 లక్షల అప్పు ఉన్నది. రెండు ఎకరాల్లో వరి పంట ఏసినం. నీళ్లు లేక పంట మొత్తం ఎండిపోతున్నది. ఉన్న ఒక్క బోరులో నీళ్లు రావడం లేదు. రూ.80 వేల అప్పు తెచ్చి కొత్తగా బోర్ ఏసిండు. దాంట్లో కూడా నీళ్లు పడలేదు. పంట చేతికి వస్తే కొంత ఉపశమనం దొరుకుతుందని అంటుండేవాడు. పంట ఎండిపోవటం, అప్పులు పెరిగిపోవటంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాకు, నా పిల్లలకు దిక్కెవరు?