Ravula Sridhar Reddy | అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో అభయహస్తం.. కానీ అది అక్కరకు రాని నేస్తం అయ్యిందని బీఆర్ఎస్ సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. మేనిఫెస్టో మాకు ఖురాన్, బైబిల్, భగవద్గీత అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారని.. కానీ ప్రభుత్వ వ్యవహారశైలి అందుకు భిన్నంగా ఉందని విమర్శించారు. పవిత్ర గ్రంథాల పేర్లు తీసుకొని వాటిని అవమానించినట్లుగా ఉందని మండిపడ్డారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బుధవారం నిర్వహించిన ప్రెస్మీట్లో రావుల మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాల అమలులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లు కనపడట్లేదని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం అంటే హామీలను తుంగలో తొక్కడమా అని ప్రశ్నించారు.
మేనిఫెస్టో అమలు విషయంలో మంత్రులకు క్లారిటీ లేదని.. సమన్వయం లేదని రావుల శ్రీధర్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ నిర్వహణలో కాంగ్రెస్ తడబడుతోందని ఆరోపించారు. రాజకీయం ఎక్కువ, పాలనపై దృష్టి తక్కువ పెడుతున్నారని అన్నారు. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్లుగా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి తయారయ్యిందని అన్నారు. కీలక అంశాలపై ముఖ్యమంత్రి, మంత్రులు తలోమాట మాట్లాడుతున్నారని విమర్శించారు. వడ్ల బోనస్ అంశంపై మంత్రుల భిన్న ప్రకటనలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయని తెలిపారు. రైతు భరోసా అమలు, కౌలు రైతులకు సాయం , వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. 100 రోజుల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు నెరవేరుస్తామని చెప్పి.. రైతులను విత్తనాల కోసం లైన్లు కట్టే దుస్థితికి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయం విషయంలో.. రైతులకు సాయం చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్లానింగ్ లేదని రావుల విమర్శించారు.
కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారని రావుల ప్రశ్నించారు. ఫ్రీ స్కూటీలు వస్తాయని విద్యార్థినులు ఎదురు చూస్తున్నారని.. ఎప్పుడు ఇస్తారని అడిగారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు రూ. 2500 ఏమయ్యాయని అడిగారు. వడ్డీ లేని పంట రుణాల పరిస్థితి ఏంటని నిలదీశారు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నారని.. వాటి గురించి ఎక్కడ చర్చ కూడా లేదని అన్నారు.. 100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఎక్కడ అని ప్రశ్నించారు. ఏ విషయంపై ప్రశ్నించినా విధి విధానాలు ఖరారు కాలేదంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా మేనిఫెస్టో అమలు విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానం, కాలపరిమితులను ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.