సిద్దిపేట, ఫిబ్రవరి 7( నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బరి తెగించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్న వ్యతరేకతతో తాము ఓడిపోతామని ముందే పసిగట్టి కుట్రలు పన్నుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు రోజురోజుకూ ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేక సభలను అడ్డుకుంటున్నారు. పైగా బీఆర్ఎస్ శ్రేణులపైకి దాడులకు దిగుతున్నారు.
రెండున్నరేండ్లలో కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేక, చెప్పేదేమీ లేక ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలోని ఆర్అండ్ఆర్ కాలనీలోని ఏటిగడ్డ కిష్టాపూర్ చౌరస్తాలో శనివారం కాంగ్రెస్ దౌర్జన్యంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకున్నది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి హరీశ్రావు ఇక్కడికి వస్తున్న విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు.. ఈలోగా అక్కడికి చేరుకొన్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ మీటింగ్ను అడ్డుకోవడానికి ముంపు గ్రామాల ప్రజల ముసుగులో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు.. బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్ను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్నారు. ముంపు గ్రామాలతో సంబంధం లేని కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకొని ప్రచారాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేయడంతోనే పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. దీని వెనుక కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది పెద్ద నేతలు ఉండి ఈ తతంగాన్ని నడిపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వీధుల్లో తిరుగుతున్న బీఆర్ఎస్ ఏడో వార్డు అభ్యర్థి ఎన్సీ సంతోష్కు చెందిన ప్రచారరథంపై ఫ్లెక్సీలను కాంగ్రెస్ కార్యకర్తలు చించివేశారు.
అక్కడి నుంచి హరీశ్రావు నిర్వహించే ప్రచారస్థలికి కాంగ్రెస్ నాయకులు తరలివచ్చి అడ్డుకునే ప్రయత్నం చేసేందుకు సిద్ధమవుతుండగా బీఆర్ఎస్ నాయకులు వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్నారు. అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్పై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. దీంతో అక్కడున్న వారిని పోలీసులు చెదరగొట్టారు. ప్రచారానికి తరలివచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలపైకి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దూసుకపోవడంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.
కాంగ్రెస్ పార్టీ ఎంతగా రెచ్చగొట్టాలనుకున్నా.. అదే ముంపు గ్రామాల ప్రజలు బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్కు పెద్ద ఎత్తున తరలివచ్చి బీఆర్ఎస్ సభను విజయవంతం చేశారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ ప్రచారాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేసినా ముంపు గ్రామాల నుంచి ప్రజలు వేలాదిగా తరలిరావడంతో కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయాలు పటాపంచలయ్యాయి. దీంతో ముంపుగ్రామాల ప్రజలను అడ్డు పెట్టుకొని రాజకీయం చేద్దామనుకున్న ప్రయత్నం బెడిసికొట్టింది. ‘మేమంతా కేసీఆర్ వెంటే ఉంటాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా వరకు క్లియర్ చేసింది. ఎక్కడో కొంతమందికి మిగిలిన కొన్ని బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. దానిని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేతలు రెచ్చగొడుతున్నారు’ వారు వారు ఆరోపించారు.
‘మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఆనాడు బాధితులను రెచ్చగొట్టిన రేవంత్రెడ్డి.. ఇవ్వాళ ఎందుకు ముఖం చాటేస్తున్నాడు. ముంపు గ్రామాల ప్రజలపై ప్రేమ ఉంటే వారి బకాయిలను తక్షణమే తీర్చవచ్చు కదా.. అది చేతగాక బీఆర్ఎస్ నాయకులపై భౌతిక దాడులకు దిగడం ఎంత వరకు సమంజసం’ అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ‘బకాయిలు ఇవ్వడం చేత కాదు. రెచ్చగొట్టడం మాత్రం వస్తుంది. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటుతున్నా పరిహారం, ప్యాకేజీలు ఇవ్వడంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ముంపుగ్రామాల్లో మిగిలిన వారికి ప్యాకేజీలు ఇవ్వాలి’ కోరుతున్నారు.