Congress | హైదరాబాద్, నవంబర్ 7(నమస్తే తెలంగాణ): పటాన్చెరు టికెట్ విషయంలో సీనియర్ నేతలు జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ మధ్య దుమారం రేగినట్టు తెలిసింది. వీరిద్దరూ ఆ టికెట్ను తమవారికి ఇవ్వాలంటే తమవారికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. నీలం మధుకు జగ్గారెడ్డి, కాట శ్రీనివాస్గౌడ్కు రాజనర్సింహ మద్దతు పలుకుతున్నారు. మూడో జాబితాలో పటాన్చెరువు టికెట్ను పార్టీ అధిష్ఠానం నీలం మధుకు కేటాయించడంతో దామోదర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
దశాబ్ద కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న శ్రీనివాస్గౌడ్ను కాదని, నాలుగు రోజుల క్రితం పార్టీలో చేరిన మధుకు టికెట్ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. మధుకు ఇచ్చిన టికెట్ను రద్దు చేసి శ్రీనివాస్గౌడ్కు కేటాయించాలని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. దీనిపై జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇచ్చిన టికెట్ను రద్దు చేస్తే ఊరుకునేది లేదంటూ పార్టీ పెద్దలకు అల్టిమేటం జారీ చేసినట్టు సమాచారం. మరోవైపు, పటాన్చెరు టికెట్కు సంబంధించి సుమారు రూ. 30 కోట్ల డీల్ కుదిరినట్టు ప్రచారం జరుగుతున్నది. తాను సూచించిన వారిలో ఒక్కరికి కూడా టికెట్ దక్కకపోవడంపై దామోదర అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. పఠాన్చెరు, నర్సాపూర్, నారాయణఖేడ్ టికెట్లను తాను సూచించిన వారికి కాకుండా ఇతరులకు కేటాయించడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది.