హైదరాబాద్, ఆగస్టు 5(నమస్తేతెలంగాణ): భారత్-రష్యా మైత్రి బలోపేతానికి వరల్డ్ పీపుల్స్ అసెంబ్లీ ప్రతినిధి కార్యాలయం దోహదపడుతుందని మంత్రి డీ సీతక్క ఆశాభావం వ్యక్తంచేశారు. హైదరాబాద్లో బుధవారం వరల్డ్ పీపుల్స్ అసెంబ్లీ ప్రతినిధి కార్యాలయాన్ని సంస్థ హెడ్ డాక్టర్ రాయల నీతూనాయుడుతో కలిసి ప్రారంభించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ దశాబ్దాలుగా భారత్-రష్యాల మధ్య కొనసాగుతున్న స్నేహం పరస్పర విశ్వాసం, గౌరవానికి నిదర్శనమని అభివర్ణించారు. పీపుల్స్ అసెంబ్లీ కార్యాలయం ఏర్పాటుతో విద్య, వైద్యం, వ్యాపా రం, పర్యాటకం, సంస్కృతి, పరిశోధనలు అభివృద్ధి చెంది కొత్త అవకాశాలు ఏర్పడుతాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్నేహం, శాంతి, అభివృద్ధి, సాంస్కృతిక అవగాహనకు దోహదపడే ప్రతి కార్యక్రమానికీ తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు.