హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ)/మహబూబ్నగర్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీలో మాదిగలను అణచివేస్తున్నారంటూ ఏకంగా సోనియాగాంధీకి లేఖ రాసిన మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ చివరకు రాజీ పడ్డారు. ‘మల్లు రవిని గెలిపించండి.. మంచి పోస్టు ఇచ్చే పూచీ నాది’ అని పీసీసీ అధినేత, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇవ్వడంతో మెత్తబడ్డారు. దీంతో నాగర్కర్నూల్ ఎంపీ టికెట్ విషయంలో తలెత్తిన వివాదం ముగిసినట్టేనని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గంలో ఓటమిపాలైన సంపత్కుమార్తోపాటు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవి నాగర్కర్నూల్ (ఎస్సీ రిజర్వ్) ఎంపీ టికెట్ కోసం పోటాపోటీగా ప్రయత్నించారు. నాగర్కర్నూల్ ఎంపీ స్థానంపై గురిపెట్టిన మల్లు రవి చివరకు ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవిని సైతం వదలుకున్నారు. ఇదే టికెట్ను ఆశించిన సంపత్కుమార్ కూడా ఢిల్లీలో గట్టి ప్రయత్నాలే చేశారు. నియోజకవర్గంలో కూడా ఇరువర్గాలు పోటాపోటీగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటుచేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో మాదిగలను అణచివేస్తున్నారంటూ ఏకంగా సోనియాగాంధీకి సంపత్కుమార్ లేఖ రాయడమే కాకుండా దానిని మీడియాకు విడుదల చేయడంతో పరిస్థితి మరింత వేడెక్కింది.
ఇది జరిగిన కొద్ది సేపటికే అధిష్ఠానం మల్లు రవికి టికెట్ ఖరారు చేసింది. దీంతో కంగుతిన్న సంపత్కుమార్ అనుచరులు ఆందోళనలకు సిద్ధమవుతుండగా శుక్రవారం అనూహ్య పరిణామం జరిగింది. కాంగ్రెస్ అధిష్ఠానం సంపత్కుమార్ను బుజ్జగించే బాధ్యతను మల్లు రవికి అప్పగించింది. దీంతో మంత్రి జూపల్లి కృష్ణారావును వెంటబెట్టుకొని మల్లు రవి శుక్రవారం ఉదయం సంపత్కుమార్ ఇంటికి వెళ్లి మంతనాలు జరిపారు. తన విజయానికి సహకరిస్తే పార్టీ పెద్దలను ఒప్పించి రాష్ట్రస్థాయి నామినేటెడ్ పోస్టు ఇప్పిస్తానని మల్లు రవి చెప్పినప్పటికీ సంపత్కుమార్ అందుకు అంగీకరించలేదని తెలిసింది. నామినేటెడ్ పోస్టు ఇస్తానని సీఎం రేవంత్రెడ్డి స్వయంగా హామీ ఇస్తే, అప్పుడు ఆలోచిస్తానని సంపత్కుమార్ తేల్చి చెప్పినట్టు సమాచారం. దీంతో మంత్రి జూపల్లి, మల్లు రవి ఈ విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, సంపత్ను తన వద్దకు తీసుకురమ్మని సూచించినట్టు తెలిసింది. దీంతో వారు సంపత్కుమార్ను వెంటబెట్టుకొని సీఎం ఇంటికి వెళ్లారు. అయితే, తనకు నామినేటెడ్ పోస్టు ఇస్తారన్న గ్యారెంటీ ఏమున్నదని సంపత్ ప్రశ్నించినట్టు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. నామినేటెడ్ పోస్టు ఇచ్చే బాధ్యత తనేదనని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇవ్వడంతో సంపత్కుమార్ తలొగ్గక తప్పలేదని ఈ వర్గాల సమాచారం. రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చే పోస్టు ఇవ్వాలని సంపత్ కోరగా, అందుకు సీఎం సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది.తాను పెట్టిన షరతులకు ఒప్పుకున్న తర్వాతనే, మల్లు రవి విజయానికి కృషి చేస్తానని సంపత్కుమార్ ప్రకటించడం వెనుక ఇంత కథ జరిగినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. అయితే, నియోజకవర్గంలోని సంపత్కుమార్ అనుచరులు మాత్రం మల్లు రవితో మిలాఖత్ కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.