Putta Madhu | కాంగ్రెస్ పార్టీ నాయకుడు తనను చంపాలని చూస్తున్నారని జడ్పీ చైర్మన్ పుట్ట మధు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఎన్నికల లోపే తనను చంపాలని చూస్తున్నారని తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ఎస్ఎల్బీ గార్డెన్స్లో శుక్రవారం జరిగిన మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంథనిలో ఒకే కుటుంబ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నోట్ల సంచులతో కోట్లు పంచి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుడు తనను చంపాలని చూస్తున్నారని.. కానీ తాను చావుకు భయపడనని పుట్ట మధు స్పష్టం చేశారు. చచ్చేవరకు ప్రజల కోసం పనిచేస్తానని అన్నారు. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ.. వారికి అండగా నిలబడతానని తెలిపారు. ఇక మాజీ స్పీకర్ మధుసూదనచారి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, ద్రోహం అని ఆరోపించారు. తెలంగాణకు ద్రోహం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు.