హైదరాబాద్, డిసెంబర్ 28(నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డిని ఆ పదవి నుంచి తప్పించబోతున్నారని, దీనిపై చర్చించేందుకే ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా రాష్ర్టానికి వచ్చారని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ అన్నారు. ఈ విషయాన్ని ఓ కేంద్ర మంత్రి స్వయంగా తనతో చెప్పారని తెలిపారు. కేంద్ర హోంమంత్రి మంత్రి అమిత్ షా గురువారం రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే. దీంతో మధుయాష్కీ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గురువారం గాంధీభవన్లో ఆయన మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ… కిషన్రెడ్డి పొద్దున లేస్తే.. జై అసద్ భాయ్ అంటున్నారని ఆరోపించారు.
ఇదంతా సికింద్రాబాద్ ఎంపీగా గెలిచేందుకేనని విమర్శించారు. తనను ఎల్బీనగర్లో కావాలనే ఓడించారని, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 30 వేల నకిలీ ఓట్లను నమోదు చేయించి తనను ఓడించారని ఆరోపించారు. పార్టీ మారేందుకు సుధీర్రెడ్డి సిద్ధంగా ఉన్నారని, వాళ్లకు వారి అక్రమాస్తులు కాపాడుకోవడమే ముఖ్యమని ధ్వజమెత్తారు. చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత సెటిలర్లు కాంగ్రెస్వైపు చూశారని, కానీ ఆయన విడుదలయ్యాక బీఆర్ఎస్వైపే మొగ్గు చూపారని అన్నారు. గ్రేటర్లో ముస్లింలు, సెటిలర్లు, రియల్టర్లు బీఆర్ఎస్కే సపోర్ట్ చేశారని తెలిపారు. బోధన్లో షకీల్ను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం సపోర్ట్ చేసిందని తెలిపారు.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 15 సీట్లు గెలువటమే టార్గెట్గా పెట్టుకున్నదని మధుయాష్కీ తెలిపారు. అయితే తాను లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయటంలేదని చెప్పా రు. నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్నదని తెలిపారు. తనకు ఎమ్మె ల్సీ పదవి ఇవ్వటంపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. బీసీ నేతలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారనేది ఊహాగానం మాత్రమేనని స్పష్టం చేశారు. ఒక రెడ్డి మంత్రి కూడా ఆ పదవి కోసం ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మంత్రివర్గ విస్తరణ పూర్తిగా సీఎం రేవంత్రెడ్డి ఇష్టమేనని, ఇందులో అధిష్ఠానం జోక్యం చేసుకోబోదని అన్నారు. అయితే నామినేటెడ్ పదవులు ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకు మాత్రం అధిష్ఠానం వ్యతిరేకమని పేర్కొన్నారు.
పార్టీ కోసం కష్టపడ్డవారికి ఆ పదవులు ఇవ్వాలని ఇప్పటికే రాహుల్ గాంధీ చెప్పినట్టు తెలిపారు. త్వరలోనే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి భారీ వలసలు ఉండబోతున్నాయని మధుయాష్కీ చెప్పారు. ఇప్పటికే బీఆర్ఎస్కు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందనే ఉద్దేశంతో తమ పార్టీ అధిష్ఠానం వద్దంటున్నదని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బీజేపీ ఎంపీ సోయం బాపురావు కాంగ్రెస్తో చర్చలు జరిపారని, పార్లమెంట్ ఎన్నికల వరకు ఆయనతో పాటు చాలా మంది బీజేపీ నేతలు కాంగ్రెస్లోకి రాబోతున్నారని వెల్లడించారు.