అమరచింత, ఆగస్టు 13 : అధికారమే పరమావ ధిగా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు 420 హమీలను ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డికి రాష్ట్రంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై సరైన అవగాహన లేకపోవడంతో అన్నదాతలు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. గురువారం సాయంత్రం ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలతో పాటు పారలాల్ కెనాల్ను పరిశీలించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారం చేపట్టిన మాజీ సీఎం కేసీఆర్కు వ్యవసాయంపై అపారఅనుభవం ఉండడంతో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి వ్యవసాయాన్ని పండుగులా చేస్తే రెండేళ్లలో సీఎం రేవంత్రెడ్డి కాంగ్రెస్ సర్కార్కు అవగాహన లేక జూరాల ప్రాజెక్టులో వరద నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ వానకాలం పంట నారుమళ్ల సమయం ముగుస్తున్నా ఇప్పటికీ సాగునీరు విడుదల చేయలేదని విమర్శించారు. బుధవారం సాయంత్రం వరకు జూరాల ప్రాజెక్టుకు ల క్షా 80 వేల క్యూసెక్యుల నీరు వస్తున్నపటికీ ఎల్ని నో ప్రభావం అంటూ కాలయాపన చేస్తూ సాగునీరు విడుదలపై రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణానది ప్రాజెక్టుపై ఉన్న ఆల్మటి కింద 17లక్షల ఎకరాల భూమి సాగు అవుతుండగా ఇక్కడి ప్రభుత్వానికి రైతు సమస్యలపై చిత్తశుద్ధి లేక కేవలం 10 వేల ఎకరాలకు కూడా సాగునీరు విడుదల చేయలేని దుస్థితిలో ఉందని అన్నారు. ఎగువ నుంచి ప్ర తి రోజు ఐదువేల క్యూసెక్యుల నీరు జనవరి మా సం వరకు వస్తుందని వానకాలం పంటకు సాగునీరు విడుదల చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. ఇంతకాలంలో దిగువకు వదిలిన నీటితో ఆంధ్రాప్రాంతంలో పంటలు పడిస్తే పక్కనే ఉన్న మన రైతులకు ప్రభుత్వం సాగునీటిని విడుదల చేయకుండా నిత్యం మాది రైతును రాజు ను చేసే ప్రభుత్వం అంటూ కపటనాటకాలు ఆడుతుందని మాజీ మంత్రి మండిపడ్డారు. ఆయన వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, నాయకులు లక్ష్మయ్య, వాకిటి శ్రీధర్, జగదీశ్వర్, రమేశ్, అశోక్, పరంజ్యోతి, మాణిక్యం, రాములుతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.