మోర్తాడ్: బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మోర్తాడ్ మాజీ సర్పంచ్ అజీజ్ సోమవారం 500 మంది అనుచరులతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ఆలస్యం అయినా అజీజ్ సరైనా నిర్ణయం తీసుకున్నారని, అభివృధి వైపే ఉంటానంటూ తనకు మరింత బలం చేకూర్చేందుకు వచ్చారని అన్నారు. వారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. ఈ రోజు నుంచి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులని అన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సర్వతోముఖాబివృద్ది సాధిస్తుందన్నారు. రైతులు, పేదలు రెండు కళ్ళుగా కేసీఆర్ పాలన సాగుతోంది అన్నారు. ఈ మధ్య బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఊర్ల మీద పడి ప్రజలను అయోమయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండి పడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ వల్ల తెలంగాణకు ఒరిగేది ఏమీ ఉండదని, రాజకీయ మిడతల దండులా తెలంగాణ మీద పడ్డారని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అభివృద్ది బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేదని ప్రశ్నించారు..? తెలంగాణలో ఉన్నట్లే తమకు కూడా అభివృద్ది కావాలని బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ప్రజలు అక్కడ నిలదీస్తున్నది వాస్తవం కాదా? అని నిలదీశారు. ఏ మొఖం పెట్టుకుని తెలంగాణలో తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ.. తెలంగాణ మీద కక్ష కట్టిందని, పచ్చగా ఉన్న తెలంగాణను ఆగం చేయాలని చూస్తోందని విమర్శించారు.
ఇక్కడ ఉన్నది కేసీఆర్.. ప్రాణం పోయినా తెలంగాణకు అన్యాయం జరిగితే ఊర్కోరని హెచ్చరించారు. మోదీ సర్కార్ కార్పొరేట్లకు దోచి పెడుతూ నిత్యావసరాల ధరలు పెంచి పేద ప్రజలను అరిగోస పెడుతున్నారని ద్వజమెత్తారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తానని అనడంతో ఢిల్లీ పీఠం మీద ఉన్నవారికి వణుకు పుడుతోందన్నారు.
యావత్ దేశం కేసీఆర్ నాయకత్వం కోరుకుంటోందని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోతే – గోస పడతామని చెప్పిన ఆయన.. తెలంగాణ ప్రజలు, రైతులు దీనిపై ఆలోచన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంతు షిండే, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.