హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అభివృద్ధికి కొత్త అధ్యాయం లిఖించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నదంటూ సీడబ్ల్యూసీ సమావేశంలో ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణవాదులు ఎద్దేవా చేస్తున్నారు. సోనియాగాంధీ మాటల్లో రాజకీయ దురుద్దేశమే తప్ప అభివృద్ధి ఎజెండా ఎక్కడ ఉన్నదని ప్రశ్నిస్తున్నారు. ‘మీరా అభివృద్ధి చేసేది? 50 ఏండ్ల మీ పాలనలో చేసిన అభివృద్ధి ఏమున్నది? ఇప్పుడేం చేస్తారు?’ అని మండిపడుతున్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి తెలుసుకోవాలని హితవు చెప్తున్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నదని, కేసీఆర్ సాధిస్తున్న అభివృద్ధిని చెడగొట్టకుంటే చాలని స్పష్టంచేస్తున్నారు. సీఎం కేసీఆర్ పుణ్యమా అని సాగునీరు, తాగునీరు, కరెంటు గోస తీరిందని, రైతుబంధు, రైతుబీమా, పంటల కొనుగోలుతో రైతులకు భరోసా లభించిందని చెప్తున్నారు. సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఏండ్లుగా గొంతెండిపోయి, పల్లెర్లు మొలిసిన పాలమూరుకు సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో జలాభిషేకం చేశారని, ఇది మీకు కనిపించలేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడిరాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏనాడైనా తెలంగాణ రైతుల సాగునీటి గోస తీర్చేందుకు ప్రయత్నించిందా? అని మండిపడుతున్నారు. తమకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ను మళ్లీ నమ్మి మోసపోయే పరిస్థితి లేదని చెప్తున్నారు.
ఆశలన్నీ ఆవిరి
సీడబ్ల్యూసీ సమావేశాలపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరయ్యాయి. ఎప్పుడూ ఢిల్లీలో జరిగే సమావేశాలను ఈసారి హైదరాబాద్లో నిర్వహించడం ద్వారా ఎన్నికలకు హైప్ తెద్దామన్న ప్లాన్ అట్టర్ఫ్లాప్ అయింది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ ఒకే సమయంలో రాష్ర్టానికి వస్తే ఏదో జరిగిపోతుందని ఆశించిన నేతలకు నిరాశే మిగిలింది. సీడబ్ల్యూసీ సమావేశాలతోపాటు సోనియా, రాహుల్ రాకను తెలంగాణ ప్రజలు కనీసం పట్టించుకోలేదు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కలవరపడుతున్నట్టు తెలిసింది. ఏదో అనుకుంటే ఇంకేదో అయిందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నిరాశ చెందినట్టు సమాచారం.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని రాష్ట్రం ఇచ్చి నెరవేర్చుకున్నామంటూ సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు భగ్గుమంటున్నారు. తెలంగాణ రాష్ట్రం మీరిచ్చింది కాదని, కొట్లాడి తెచ్చుకున్నదని తేల్చి చెప్తున్నారు. ప్రజల కొట్లాట, ఎందరో అమరవీరుల త్యాగం, కేసీఆర్ తెగింపుతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని అంటున్నారు. పోరాటాల ఫలితంగా గతిలేని పరిస్థితిలో తెలంగాణ రాష్ర్టాన్ని ఇవ్వాల్సి వచ్చిందే తప్ప ఇక్కడి ప్రజలపై ప్రేమతో కాదని గుర్తు చేస్తున్నారు.