హైదరాబాద్: రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు పడిపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కన్నా డేంజరెస్ వైరస్ కాంగ్రెస్ అని ఏడాది క్రితం చెప్పిన మాట ఇవాళ అక్షరాలా నిజమైందన్నారు. అసమర్థ సీఎం ఆర్థిక వృద్ధికి గొయ్యితీసి పాతరేశారని ధ్వజమెత్తారు. దేశంలోనే అగ్రభాగాన ఉన్న తెలంగాణను ఆఖరికి పడేశారని మండిపడ్డారు. గతేడాది 10 శాతం నమోదైన జీఎస్టీ వసూళ్లు, ఇప్పుడు కేవలం ఒకే ఒక్కశాతం వృద్ధికి పడిపోవడం సిగ్గుచేటన్నారు.
చెత్త నిర్ణయాలతోనే తెలంగాణ ఆర్థికరంగంలో ఈ విధ్వంసమని విమర్శించారు. మతిలేని ముఖ్యమంత్రి ఘోర తప్పిదాల వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని చెప్పారు. ప్రభుత్వ పెద్దల కమీషన్లు ఆకాశాన్ని అంటుతుంటే, రాష్ట్ర రాబడులు మాత్రం కుప్పకూలడం క్షమించరాని నేరమని చెప్పారు. కేసీఆర్ పదేళ్ల స్వర్ణయుగాన్ని చెరిపేసి ముఖ్యమంత్రి రాసుకునే “చీకటి చరిత్ర” ఇదేనా అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
ఆర్థిక వృద్ధిలో అట్టడుగున తెలంగాణ!
రాష్ట్ర ఆర్థిక వృద్ధి ఆగిపోతున్నది. బీఆర్ఎస్ హయాంలో రాకెట్ వేగంతో పెరిగిన రాష్ట్ర ఆదాయం.. కాంగ్రెస్ హయాంలో మందగించింది. ఇప్పటికే రెవెన్యూ రాబడుల్లో భారీ లోటు నమోదు కాగా.. తాజాగా జీఎస్టీ వసూళ్లలోనూ స్తబ్ధత నెలకొన్నది. ఈ ఏడాది ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్లకు సంబంధించి కేంద్రప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఈ నివేదిక ప్రకారం.. ఫిబ్రవరిలో రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు రూ.5,280 కోట్లుగా నమోదయ్యాయి. నిరుడు ఫిబ్రవరితో పోల్చితే ఒక్క శాతం మాత్రమే పెరిగాయి. తద్వారా దేశంలోనే అత్యల్ప వృద్ధిరేటు నమోదు చేసిన రాష్ట్రంగా తెలంగాణ అట్టడుగున నిలిచింది. ఇప్పటికే రాష్ట్ర రెవెన్యూ రాబడులు పడిపోయిన సంగతి తెలిసిందే. నిరుడు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది జనవరి నాటికి ఏకంగా రూ.13 వేల కోట్లకు పైగా రెవెన్యూ రాబడుల లోటు నమోదైంది. తాజాగా జీఎస్టీ వసూళ్ల వృద్ధి సైతం మందగించడం ఆర్థిక శాఖ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కొవిడ్ సంక్షోభం తర్వాత
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి జీఎస్టీ వసూళ్లలో వృద్ధి కనబరిచింది. ఏటికేడు వసూళ్లు పెరిగాయి. అయితే కరోనా సంక్షోభం తలెత్తినప్పుడు మాత్రమే తొలిసారిగా మైనస్ వృద్ధి నమోదైంది. 2020లో కొవిడ్ విపత్తు కారణంగా లాక్డౌన్ ప్రకటించడం, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో 2021 ఫిబ్రవరి వసూళ్లలో -1 శాతం వృద్ధిరేటు నమోదైంది. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ పాలనలోనే వృద్ధిరేటు మందగించినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సర్కారు అసమర్థ, అనాలోచిత విధానాలు, అసంబద్ధ నిర్ణయాలతోనే ఈ పరిస్థితి నెలకొన్నదని నిపుణులు మండిపడుతున్నారు. కీలక రంగాలన్నీ దెబ్బతినడంతో దాని ప్రభావం కొనుగోళ్లపై పడి జీఎస్టీ వృద్ధి స్తంభించిందని చెప్తున్నారు. హైడ్రా, మూసీ సుందరీకరణ వంటి వాటితో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నదని, పెట్టుబడి సాయం అందించక, సరైన సమయంలో పంట కొనుగోళ్లు చేయక వ్యవసాయ రంగం సంక్షోభం వైపు అడుగులు వేస్తున్నదని అంటున్నారు. ఆర్డర్లు లేక చేనేత రంగం విలవిల్లాడుతున్నదని చెబుతున్నారు. పారిశ్రామిక, సేవా రంగాల్లో వృద్ధిరేటు నమోదు కావడం లేదని, పరిశ్రమలు వెళ్లిపోతున్న పరిస్థితి ఉన్నదని పేర్కొంటున్నారు. ఇలా కీలక రంగాలన్నీ దెబ్బతింటుండటంతో దేశంలోనే అతి తక్కువ జీఎస్టీ వసూళ్ల వృద్ధితో రాష్ట్రం అట్టడుగున నిలిచిందని చెప్తున్నారు.
కేంద్ర నివేదిక ప్రకారం..
నిరుటితో పోల్చితే ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లలో సగటు వృద్ధిరేటు 10 శాతంగా నమోదైంది.
త్రిపుర (21%) హర్యానా (20%),మధ్యప్రదేశ్ (15%) టాప్లో నిలిచాయి.
కేవలం ఒక్క శాతం వృద్ధితో తెలంగాణ,అరుణాచల్ప్రదేశ్ అట్టడుగున నిలిచాయి.
పొరుగున ఉన్న ఏపీ 4% వృద్ధి సాధించగా.. కర్ణాటక 10 %, మహారాష్ట్ర 13 %,ఛత్తీస్గఢ్ 7 శాతం వృద్ధిని నమోదు చేశాయి.