Minister KTR | హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ‘ఏఐసీసీ అంటే అఖిల భారత కరప్షన్ కమిటీ. మాది బీజేపీ బంధువుల పార్టీ కాదు.. మీదే భారత రాబందుల పార్టీ. దేశంలో అవినీతికి, అసమర్థతకు కేరాఫ్ అడ్రస్.. కాంగ్రెస్’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఖమ్మం సభలో రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా మంత్రి నిప్పులు చెరిగారు. ‘సాములే తాచుపాములై.. మీ యూపీఏను.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ను దిగమింగిన చరిత్రను ప్రజలు మరిచిపోలేదు. మా పార్టీ బీజేపీకి.. బీ టీమ్ కాదు.. కాంగ్రెస్ పార్టీకి.. సీ టీమ్ అంతకన్నా కాదు. బీజేపీ-కాంగ్రెస్ రెండింటీనీ ఒంటిచేత్తో ఢీకొట్టే.. ఢీ టీమ్.. బీఆర్ఎస్ను నేరుగా ఢీకొనే దమ్ములేక బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చే కుట్ర చేస్తారా? ఈ మిస్ ఫైరింగ్లో ముమ్మాటికీ కుప్పకూలేది.. కాంగ్రెస్సే. లక్ష కోట్లు వ్యయం కాని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షకోట్ల అవినీతా? అర్థంలేని ఆరోపణలు చేసి.. ప్రజాక్షేత్రంలో ఎన్నిసార్లు నవ్వులపాలవుతారు.
తెలంగాణ ప్రజలు కోరుకొంటున్నది.. నిర్మాణాత్మక ప్రతిపక్షం. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కూడా తెలియని ప్రతిపక్షం కాదు. భూములు, భూరికార్డుల చుట్టూ అల్లుకున్న సవాలక్ష చికుముళ్లను విప్పిన ధరణిని ఎత్తివేసి.. మళ్లీ దళారుల రాజ్యం తెస్తామన్న రాహుల్ గాంధీని తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదు.. కర్ణాటకలో ‘అన్నభాగ్య’ హామీని గంగలో కలిపి.. ఇకడ 4 వేల పింఛన్ అంటే నమ్మేదెవరు? ఎన్నికల్లో హామీ ఇచ్చిన రేషన్ ఇవ్వలేనోళ్లు ఇకడికొచ్చి డిక్లరేషన్ అంటే విశ్వసించేదెవరు? కర్ణాటకలో బీజేపీని ఓడించింది అకడి ప్రజలు తప్ప ముమ్మాటికీ కాంగ్రెస్ కానే కాదు. మరో ప్రత్యామ్నాయం లేకే ఆ ఫలితం తప్ప.. అది మీ ఘనత కాదు. సమర్థత అంతకన్నా కాదు’ అని మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు.
సమ్మక జాతరను తలపించేలా పండుగలా సాగుతున్న పోడు భూముల పట్టాల పంపిణీ రాహుల్ గాంధీకి కనబడడం లేదా? అయితే.. కంటి వెలుగు కింద పరీక్షలు చేయించుకోవాలంటూ మంత్రి కేటీఆర్ చురకలంటించారు. 4.6 లక్షల ఎకరాల భూమికి పట్టాలు పంచి.. అడవిబిడ్డల జీవితాల్లో ఆనందాన్ని నింపిన మనసున్న ముఖ్యమంత్రి కేసిఆర్ అని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు నియామకాలు అనే ఉద్యమ నినాదాలనే కాదు జల్ జంగల్ జమీన్ అనే మన్యంవీరుడు కుమ్రంభీం కలలను కూడా సంపూర్ణంగా సాకారం చేసిన దార్శనిరకుడు కేసీఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్ పాలనలో ‘మంచం పట్టిన మన్యం’ వార్తలు వస్తే మా పాలనలో ‘మన్యానికి మంచిరోజులు’ అనే వార్తలు వచ్చాయని తెలిపారు.
తెలంగాణలో నిరంతరం పేదల పక్షాన నిలిచిన పార్టీ బీఆర్ఎస్సేనని, బ్రోకర్లు, కబ్జాకోరుల పక్షాన ఎప్పుడూ నిలబడే పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. కారు స్టీరింగ్ కేసీఆర్ చేతిలో పదిలంగా ఉందని, కానీ కాంగ్రెస్పైనే రాహుల్కు కంట్రోల్ తప్పింది అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇప్పటికే బంగాళాఖాతంలో నిండా మునిగిన పార్టీ అని, ప్రజల గుండెల నిండా అభిమానం పొందిన పార్టీ బీఆర్ఎస్ అని వివరించారు. బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలన వెలుగుల ప్రస్థానమని, గత కాంగ్రెస్ పదేళ్ల పాలన చీకటి అధ్యాయమని అభివర్ణించారు. కుమ్ములాటల కాంగ్రెస్ను నమ్మితే మళ్లీ కల్లోలమేననే విషయం చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ సమాజానికి తెలిసిన నిలువెత్తు నిజమని వివరించారు. ‘బీఆర్ఎస్ విస్తరిస్తే అంత వణుకెందుకు, జాతీయ రాజకీయాలు.. మీ జాగీరా?’ అని నిలదీశారు. వజ్రోత్సవాలు జరుపుకొంటున్న వేళ దేశానికి దొరికిన వజ్రాయుధం బీఆర్ఎస్ అని మంత్రి కేటీఆర్ అభివర్ణించారు.