అతడో డమ్మీ నాయకుడు
వరంగల్కు వచ్చి ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదివిన రాహుల్గాంధీ, కాంగ్రెస్లో అసలు ఏ హోదాలో ఉన్నారో ఎవరికీ తెలియదు. ఏ పదవిలో ఉండి డిక్లరేషన్ అన్నడో నాకైతే తెల్వదు. కాంగ్రెస్కు మమ్మీగారు అధ్యక్షురాలు. ఈ డమ్మీగారు ఎవరో.. ఏందో తెల్వదు. ఎప్పుడు ఇండియాలో ఉంటడో, ఎప్పుడు బయట ఉంటడో తెల్వదు. కాంగ్రెస్ అల్లం చేస్తది, బెల్లం చేస్తదని డైలాగులు కొడితే నమ్మడానికి ఇది టెన్ జన్పథ్ కాదు. చైతన్యానికి ప్రతీక అయిన తెలంగాణ జనపథం. కాంగ్రెస్ ఏందో, దాని ఎత్తెంతో, పొడవెంతో ప్రజలకు తెలుసు.
ఎవరిది రాజరికం?
ఎవరు రాజు, ఎక్కడ రాజు. మా ముఖ్యమంత్రి నిజంగా రాజైతే మీ పీసీసీ అధ్యక్షుడు మాట్లాడే మాటలకు బయట తిరుగుతుండెనా? నిన్నే యువరాజు అని పిలుస్తరు. నీకు కిరీటం ఎక్కడ ఉన్నదో తెల్వదు. మీ ముత్తాత నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ, సోనియాగాంధీ… ఇప్పుడు నువ్వు. రాజరికం మాదిరిగా దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఉన్న రు. మీరిక్కడికి వచ్చి రాజు అని మాట్లాడుతరా?
ఎవరిది రిమోట్ పాలన?
యూపీఏ పదేండ్ల పాలనలో రిమోట్తో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ను ఆడించింది ఎవరో దేశానికి తెలుసు. అవి మరిచి తెలంగాణలో రిమోట్ పాలనని రాహుల్ అనడమా? మన్మోహన్సింగ్ నేతృత్వంలో.. మంత్రివర్గంలో నేరపూరిత రాజకీయాలను అరికట్టాలని ఆర్డినెన్స్ తెస్తే చింపేసి, చెత్తబుట్టలో వేసింది రాహుల్ కాదా? ఇది రిమోట్ కంట్రోల్ పాలన కాదా? ఇది రాజ్యాంగేతర
శక్తిగా వ్యవహరించడం కాదా?
మేం తెలంగాణ ప్రజల ఏ టీం
ఒకడొచ్చి బీజేపీకి టీఆర్ఎస్ బీ టీం అంటడు. ఇంకొకడొచ్చి కాంగ్రెస్ బీ టీం అంటడు. ఎవరికీ బీ టీం, సీ టీం అయ్యే దౌర్భాగ్యం మాకు పట్టలేదు. మేం తెలంగాణ ప్రజల ఏ టీం. అవ్వల్దర్జాగా తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే టీం. తెలంగాణ ప్రజల కోసం ఎవ్వరితో అయినా కొట్లాడేది మేం. ఎవరికో తొత్తులుగా, ఎవరికో బీ, సీ టీంగా ఉండాల్సిన అవసరం, దౌర్భాగ్యం మాకు లేదు.
–వరంగల్ పర్యటనలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు
వరంగల్, మే 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాజరికపు పోకడలతో కాంగ్రెస్ పార్టీ దేశానికి రాచపుండులా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి లేడని, రాజు ఉన్నాడంటూ కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముత్తాత నెహ్రూనుంచి ఇప్పటివరకు రాహుల్ వంశమే దేశాన్ని రాజరిక వ్యవస్థలా పాలిస్తూ వచ్చిందని పేర్నొన్నారు. దిక్కుమాలిన, దివాళాకోరు, భావ దారిద్య్రపు కాంగ్రెస్ను పాతరేస్తే తప్ప ఆ పార్టీ గతంలో చేసిన పాపాలకు నిష్కృతి లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్ని రంగాల్లో తెలంగాణ అద్భుత ప్రగతిని సాధిస్తుంటే.. రాజకీయ దివాళాకోరుతనంతో కొందరు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాహుల్ను డమ్మీ నాయకుడిగా పేర్కొన్న మంత్రి కేటీఆర్.. ఆయన చెప్పిందల్లా నమ్మడానికి ఇది టెన్ జనపథ్ కాదని, చైతన్యానికి ప్రతీక అయిన తెలంగాణ జన పథమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సాగును సంక్షోభంగా మార్చితే.. సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని అద్భుతశక్తిగా మార్చారని చెప్పారు.
శనివారం వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్.. ప్రతిష్ఠాత్మకమైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో రూ.1,600 కోట్లతో ప్రఖ్యాత కిటెక్స్ పరిశ్రమకు భూమిపూజ చేశారు. గణేశా ఎకోస్పేర్ కంపెనీ ఏర్పాటు చేసిన వస్త్ర పరిశ్రమలను, టెక్స్టైల్ పార్కుకు మిషన్ భగీరథ నీటిని అందించేందుకు చేపట్టనున్న 100 కోట్ల పనులను కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో రాజరికపాలన సాగుతుందన్న రాహుల్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘ముఖ్యమంత్రి పెత్తందారీలాగా, నియంతలాగా వ్యవహరించేవారైతే.. పీసీసీ అధ్యక్షుడు రోజూ మాట్లాడే కారుకూతలు, బూతులు విని ఊరుకుంటరా? జర్నలిస్టుల పేరుతో రోజూ పొద్దున కొందరు చిల్లర వ్యాఖ్యలు చేసే స్వాతంత్య్రం ఉంటుండెనా?’ అని ప్రశ్నించారు.
వరంగల్కు వచ్చి ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదివిన రాహుల్గాంధీ ప్రస్తుతం కాంగ్రెస్లో ఏ హోదాలో ఉన్నారో ఎవరికీ తెలియదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘నిన్న వరంగల్కు ఒకాయన వచ్చిండు. ఆయన ఏ హోదాలో వచ్చిండో, ఏ పదవిలో డిక్లరేషన్ అన్నడో నాకైతే తెల్వదు. కాంగ్రెస్కు మమ్మీగారు అధ్యక్షురాలు. ఈ డమ్మీగారు ఏందో తెల్వదు. ఆయన ఎప్పుడు ఇండియాల ఉంటడో, ఎప్పుడు బయట ఉంటడో తెల్వదు’ అని అన్నారు. ‘మీరు ఏ సొల్లుపురాణం చెప్పినా మీ కాంగ్రెస్ నాయకులు డూడు బసవన్నల లెక్క తలూపుతరు. తెలంగాణ ప్రజలు అట్ల కాదు. కాంగ్రెస్ ఏందో, దాని ఎత్తెంతో, పొడవెంతో వాళ్లకు స్పష్టంగా తెలుసు. రాహుల్గాంధీ ఒక్క చాన్స్ ఇవ్వండన్నడు. దిక్కుమాలిన కాంగ్రెస్కు దేశ ప్రజలు ఒక్కటి కాదు పది చాన్సులు ఇచ్చిండ్రు. మీ ముత్తాత, మీ నాయనమ్మ, మీ నాన్న, అందరికీ ఇచ్చిన చాన్సులు ఏమైనయి? 50 ఏండ్లు దేశాన్ని మీ చేతులనే పెడితే కరెంటు, నీళ్లియ్యలేని, రైతు ఆత్మహత్యలను నివారించలేని అసమర్థులుగా మిగిలారు’ అని విమర్శించారు.
ప్రధానిని రిమోట్తో అడించారు..
యూపీఏ హయాంలో పదేండ్లపాటు రిమోట్తో ప్రధానిని ఆడించిందెవరో దేశప్రజలకు తెలుసని, అవన్నీ మరిచిపోయి తెలంగాణలో రిమోట్ పాలన కొనసాగుతుందనడంపై ప్రజలంతా నవ్వుకుంటున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘2004 నుంచి 2014 వరకు దేశంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. మమ్మీగారి చేతిలో రిమోటు, డమ్మీగారి చేతిలో పాలన. ప్రధాని మన్మోహన్సింగ్ను రిమోట్తో ఆడించిందెవరు? మీ పార్టీ అధ్యక్షురాలు కాదా? యూపీఏ చైర్పర్సన్గా సోనియాగాంధీ రాజ్యాంగేతర శక్తిగా, ప్రధానిని మించిన అధికారాలతో చెలరేగిపోలేదా? నేరపూరిత రాజకీయాలను అరికట్టాలని మన్మోహన్ క్యాబినెట్ ఆర్డినెన్స్ తెస్తే.. దాన్ని చింపేసి, చెత్తబుట్టలో వేసింది ఈ రాహుల్ కాదా? ఇది రిమోట్ కంట్రోల్ పాలన కాదా? రాజ్యాంగేతరశక్తిగా వ్యవహరించడం కాదా? నీ పార్టీ ప్రధానమంత్రి తెచ్చిన ఆర్డినెన్స్ను గౌరవించలేని నువ్వు రిమోట్ కంట్రోల్ పాలన గురించి మాట్లాడుతవా?’ అని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
అది స్కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ అసలు పేరు స్కాంగ్రెస్ అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆకాశం నుంచి పాతాళం దాకా అన్నిచోట్లా కాంగ్రెస్ స్కాంలకు పాల్పడిందన్నారు. ‘కాంగ్రెస్ చేయని కుంభకోణం లేదు. ఆకాశంలో ఎగిరే అగస్టా, స్పెక్ట్రం నుంచి పాతాళంలో బొగ్గు దాకా అన్నీ దోచుకున్నరు. ఆదర్శ్, బోఫోర్స్, కామన్వెల్త్.. ఏ టూ జెడ్ వరకు అన్ని కుంభకోణాల్లో కూరుకుపోయిన అవినీతి, అసమర్థ, దిక్కుమాలిన పార్టీ కాంగ్రెస్’ అని మండిపడ్డారు. ఓటుకు నోటుకేసులో దొరికిన దొంగను పక్కన కూచోబెట్టుకున్న రాహుల్ అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. ‘రాహుల్ గాంధీ.. ఎమ్మెల్సీని కొనేందుకు రూ.50 లక్షలతో దొరికిపోయిన అవినీతిపరుడు మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. ఎవరో ఇచ్చిన స్క్రిప్టు చదువుడు కాదు. ఏం జరుగుతున్నదో, ఎక్కడ మాట్లాడుతున్నవో తెలుసుకోవాలి’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ అవుట్డేటెడ్ పార్టీ
కాంగ్రెస్ అవుట్డేటెడ్, అవుటైన పార్టీ అని వ్యాఖ్యానించిన మంత్రి కేటీఆర్.. దేశంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునేటోడు ఎవడూ లేడని చెప్పారు. ‘రాహుల్ సొంత సీటు అమేథిలోనే గెలవలేదు. అక్కడ గెలవలేక కేరళల పడ్డడు. తన ఎంపీ సీటు పరిధిల రెండు అసెంబ్లీ సీట్లు పోగొట్టుకున్నడు. ఇక్కడ తెలంగాణల గెలిపిస్త అని అంటున్నడు. నువ్వొచ్చి గెలిపిస్తనంటే మేం చూడాలె ఇగ. గంత పిచ్చోళ్ల లెక్క కనబడుతున్నమా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని నరనరాన నింపుకొన్న వ్యక్తి పీసీసీ అధ్యక్షుడని, అలాంటి గాడ్సేకు గాంధీభవన్ను రాహుల్ అప్పజెప్పిండని ఎద్దేవాచేశారు.
కాంగ్రెస్కు సాగును పాతరేసింది
ఏడు దశాబ్దాల కాంగ్రెస్ పాలన వ్యవసాయానికి పాతర వేసిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో రైతు జాతర జరుగుతున్నదని చెప్పారు. ‘2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో 45 లక్షల టన్నుల ధాన్యం పండితే.. రాష్ట్ర ప్రభుత్వం 24,29,536 టన్నులు కొనుగోలు చేసింది. 2021లో మూడు కోట్ల టన్నుల వడ్లు పండినయి. రాష్ట్ర ప్రభుత్వం ఒక కోటి 41 లక్షల 878 టన్నుల ధాన్యాన్ని కొన్నది. తెలంగాణలో వ్యవసాయం అభివృద్ధి చెందలేదనడం కండ్లుండీ చూడలేని అజ్ఞానులే’ అని పేర్కొన్నారు. తెలంగాణలో 2004 నుంచి 2014 వరకు ఎన్సీఆర్బీ రికార్డు ప్రకారం 16 వేల రైతులు అత్మహత్యలు చేసుకున్నారని, తెలంగాణ వచ్చిన తర్వాత దేశంలోనే అత్యల్పంగా రైతు ఆత్మహత్యలు నమోదయ్యాయని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది వాస్తవం కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్కు చెందిన గాడ్సే అడిగిన ప్రశ్నకే కేంద్రం ఈ వివరాలు వెల్లడించిందని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ పార్లమెంటుకు పోడు, ఇనడు, తెలుసుకోడని అన్నారు.
సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, ఎంపీ పసునూరి దయాకర్, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, బస్వరాజు సారయ్య, బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, బానోత్ శంకర్నాయక్, రాజయ్య, పెద్ది సుదర్శన్రెడ్డి, వొడితల సతీశ్కుమార్, గండ్ర వెంకటరమణారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నన్నపునేని నరేందర్, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, విక లాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మాది తెలంగాణ ప్రజల టీం
ఎవరికో తొత్తులుగా, బీ-టీం, సీ-టీంగా ఉండాల్సిన దౌర్భాగ్యం టీఆర్ఎస్కు లేదని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ‘ఒకడొచ్చి బీజేపీ బీ-టీం అంటడు. ఇంకొకడొచ్చి కాంగ్రెస్ బీ-టీం అంటడు. ఎవ్వలకు బీ-టీంగా, సీ-టీముగా పనిచేసే దౌర్భాగ్యం మాకు పట్టలేదు. మేం తెలంగాణ ప్రజల ఏ-టీం. అవ్వల్ దర్జాగా తెలంగాణ కోసం కొట్లాడే టీం.’ అని అన్నారు.
వీపు పగులుతదనే ఇచ్చిండ్రు
తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇచ్చిందని రాహుల్చెప్పడం విడ్డూరంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘తెలంగాణ ఇచ్చినమనే మాటలు వింటే బాధనిపిస్తది. నష్టం జరుగుతదని తెలిసినా రాష్ట్రం ఇచ్చేటంత గొప్పోళ్లా మీరు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు ఇష్టంలేని పెండ్లి చేసింది మీ తాత నెహ్రూ. ఆ తప్పును సరిదిద్దడానికి 1956 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రజలు కొట్లాడిండ్రు. జయశంకర్ సారులాంటి మేధావుల రూపంలో ప్రజలు ఉద్యమించిండ్రు. 2001లో టీఆర్ఎస్ పుట్టినంక అనివార్య పరిస్థితుల్లో, ఇయ్యకపోతే వీపు పగులుతదని తెలంగాణ ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రజలు గుంజుకుంటరని, కాంగ్రెస్ను పాతరేస్తరని భయపడి ఇచ్చిండ్రు. అయినా ఇచ్చినోడిదే గొప్ప ఐతే దేశానికి స్వాతంత్రం ఇచ్చిన బ్రిటిషోళ్లు గొప్పోళ్లా? సాధించిన భారతీయులు గొప్పోళ్లా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ఏఐసీసీ అంటే ఆలిండియా కాంగ్రెస్ కమిటీ కాదని, ఆలిండియా క్రైసిస్ కమిటీ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో అసమ్మతి లొల్లి నడుస్తుంటే.. రాష్ట్ర కాంగ్రెస్లో ఒకరిపై ఒకరు యుద్ధాలు చేసుకునే పరిస్థితి ఉన్నదన్నారు. ఒకవేళ నలుగురు కలిసుంటే.. రెండు రోజులకే ఆ పార్టీ ఏమైతదో తెలువదని వ్యాఖ్యానించారు.
వరంగల్ డిక్లరేషన్లో కొత్తదనమున్నదా?
కాంగ్రెస్ చెప్తున్న వరంగల్ డిక్లరేషన్లో కొత్తదనం లేదని, అది పాత చింతకాయ పచ్చడి అని మంత్రి కేటీఆర్ తెలిపారు. 2018లో వేరే రంగు లాల్చీ వేసుకునివచ్చి ఇదే మాట చెప్పిపోయారని అన్నారు. ‘రెండు లక్షల రుణమాఫీ, రైతుబంధు కింద రూ.15 వేలు ఇస్తమని నిన్న రాహుల్గాంధీ చెప్పిండు. ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. రాహుల్కు దమ్ముంటే ముందు ఆ రాష్ర్టాల్లో అమలుచేసి దేశం మొత్తం చేస్తమని చెప్పాలి. జాతీయపార్టీ అంటే రాష్ర్టానికో డిక్లరేషన్ ఉంటదా? ఏ రోటికాడ ఆ పాట పాడుతరా? ఏ ఓట్లు ఎట్ల దొబ్బుకుపోవాల్నా అని మాట్లాడి అవతల పడుతరా? జాతీయపార్టీకి జాతీయ విధానాలు ఉండవా? కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్లో 24 గంటల కరెంటు ఎందుకు ఇవ్వట్లేదు? రాజస్థాన్లో రైతుబంధు, రైతుబీమా ఎందుకు లేవు?’ అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నూకలు తినాలంటూ తెలంగాణ ప్రజల్ని అవమానించినప్పుడు రాహుల్ ఎందుకు మాట్లాడలేదని, వడ్ల కొనుగోలు విధానం దేశవ్యాప్తంగా ఒక్కటే ఉండాలని ఎందుకు నిలదీయలేదని అన్నారు. కాంగ్రెస్ రైతు సంక్షేమం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని, దేశంలో ఆదర్శ రైతులుగా చెప్పుకొనే పంజాబ్ ప్రజలు ఆ పార్టీని రాష్ట్రం నుంచి తన్ని తరిమేసిన విషయం మరిచిపోవద్దని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.
కేసీఆర్ పాలనలో సమతుల్య, సమ్మిళిత అభివృద్ధి
అభివృద్ధి, సంక్షేమం.. జోడెడ్ల మాదిరిగా తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలబెడుతున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తదితర కార్యక్రమాలతో సమ్మిళిత అభివృద్ధి జరుగుతున్నదని, వ్యవసాయం, పరిశ్రమ బాగుండాలని కొత్త విధానాలు అమలుచేస్తున్నారని చెప్పారు. ఒకవైపు పారిశ్రామిక, ఐటీ రంగాల్లో ప్రగతితోపాటు.. హరితహారం వంటి పర్యావరణహిత కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ‘దేశచరిత్రలోనే 75 ఏండ్లలో ఏ నాయకుడు చేయనివిధంగా సీఎం కేసీఆర్ తెలంగాణను ప్రగతిపథంలో తీసుకెళ్తున్నారు. అద్వితీయ విజయాలతో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. దేశ జనాభాలో 2.5% ఉన్న తెలంగాణ.. కేసీఆర్ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన జీడీపీలో ఐదుశాతాన్ని వాటాగా అందిస్తున్నది. ఇది మేం డబ్బా కొట్టుకుంటున్న మాట కాదు. స్వయంగా కేంద్రం, ఆర్బీఐ చెప్తున్న లెక్కలే. కేంద్రానికి అయిష్టత ఎంతున్నా.. తెలంగాణ ప్రగతిని ఒప్పుకోక తప్పట్లేదు. అన్ని శాఖలకు కితాబులు, అవార్డులు వస్తున్నాయి. కొందరు మాత్రం ఇక్కడ ఏమీ జరుగనట్టు మాట్లాడి.. తమ భావ దారిద్య్రాన్ని, దివాళాకోరుతనాన్ని, రాజకీయ అజ్ఞానాన్ని తెలంగాణ ప్రజల ముందు ప్రదర్శిస్తున్నరు’ అని అన్నారు.