హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రాజకీయ పర్యటన చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి తెలంగాణ అమరవీరులు మాత్రం గుర్తుకు రాలేదు. రెండు రోజుల పర్యటనలో ఒక్కసారి కూడా తెలంగాణ నినాదం చేయలేదు. అమరవీరుల ప్రస్తావన లేదు. గన్పార్క్ ముందు నుంచే పలుమార్లు వెళ్లినా అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించాలనే సోయి కూడా లేకపోవడంపై తెలంగాణ సమాజం మండిపడుతున్నది. గన్పార్క్లో అమరులకు నివాళి అర్పించే తీరిక లేదు కానీ, చంచల్గూడ జైలులో ఉన్న ఎన్ఎస్యూఐ కార్యకర్తలను పరామర్శించడానికి మాత్రం సమయం దొరికిందా? అంటూ మండిపడుతున్నారు.
ఇదేనా అమరవీరులకు కాంగ్రెస్ పార్టీ, రాహుల్గాంధీ ఇచ్చే గౌరవం అంటూ ప్రశ్నిస్తున్నారు. చివరగా అమరుల త్యాగానికి గుర్తుగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి రాజకీయం చేయడం గమనార్హం. రేవంత్రెడ్డి స్వయంగా రాహుల్ను అక్కడికి తీసుకెళ్లి.. నిర్మాణంలో ఆలస్యం అవుతున్నదంటూ వివరించారు. మరి అదే రేవంత్.. రాహుల్ను గన్పార్క్ అమరవీరుల స్థూపం వద్దకు ఎందుకు తీసుకెళ్లలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాహుల్కు నిజంగా తెలంగాణపై, ప్రజలపై, రైతులపై ప్రేమ ఉంటే ముందుగా అమరవీరులకు నివాళి అర్పించే వారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రాణాలను బలిచ్చిన అమరులే గుర్తు లేనప్పుడు ఇక ప్రజలను, వారి కష్టాలను గుర్తిస్తారనడం హాస్యాస్పదమని పెదవి విరుస్తున్నారు. రాహుల్కు మొఖం చెల్లకనే అమరులకు నివాళి అర్పించలేదని పలువురు చెప్పుకొంటున్నారు.