Revanth Reddy | తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే సీనియర్ లీడర్లు ఉత్తమ్ కుమార్రెడ్డి, భట్టి విక్రమార్క ఢిల్లీలో మకాం వేసి తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరు నేతలు ముఖ్యమంత్రి పదవితో పాటు కేబినెట్ బెర్తులపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు కొత్త సీఎంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యతన సమావేశం జరిగింది. ఇందులో రాహుల్ సీఎంగా రేవంత్ పేరును సూచించినట్లు తెలిసింది.
భేటీ అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడుతూ సీఎం అభ్యర్థిత్వం ఖరారైందని ప్రకటించారు. ఈ క్రమంలో ఇవాళ ముఖ్యమంత్రి ఎవరనేదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. తాజాగా కీలక పరిణామం చోటు చేసుకున్నది. ముఖ్యమంత్రి పదవి రేస్లో ఉన్న టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. అధిష్ఠానం నుంచి పిలుపు అందుకున్న రేవంత్ వెంటనే ఢిల్లీకి ప్రయాణమయ్యారు. మరో వైపు కాంగ్రెస్లో గంట గంటకు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే, రేవంత్రెడ్డిని ఢిల్లీకి ఎందుకు పిలిచారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. రేవంత్నే ముఖ్యమంత్రిగా ఖరారు చేస్తారా? సీనియర్ నేతల లాబీయింగ్ నేపథ్యంలో తలొగ్గి కేబినెట్ బెర్త్ను ఖరారు చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే, సీనియర్ నేతలైన ఉత్తమ్ కుమార్రెడ్డి, భట్టి విక్రమార్క ఇద్దరు ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇద్దరు నేతలు తమవంతుగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తున్నది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశం అయ్యారు. భేటీలో డీకే శివకుమార్, మాణిక్ ఠాకే, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్రెడ్డి పాల్గొన్నారు. దాదాపు 40 నిమిషాల పాటు కొనసాగింది. ఇద్దరు నేతలు సీఎంతో పాటు కేబినెట్ బెర్తులపై కీలకంగా చర్చించి తమ వైఖరిని స్పష్టం చేసినట్లు సమాచారం. ఇంతకు ముందు ఉత్తమ్ కుమార్రెడ్డి మాట్లాడుతూ తాను సీఎం రేసులో ఉన్నానంటూ కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.