నల్లగొండ సిటీ, జూలై 09 : నల్లగొండ మండలం తోరగల్ గ్రామంలో గురువారం నర్సింగ్ లక్ష్మయ్యకు చెందిన 10 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అలాగే పతంజలి సంస్థ ఆధ్వర్యంలో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నల్లగొండ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి పి.శేఖర్, ఉద్యాన అధికారి పిన్నపరెడ్డి అనంత రెడ్డి చేతుల మీదుగా నిర్వహించారు. ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారితో పాటు పతంజలి కంపెనీ ప్రతినిధులు, గ్రామ రైతులు కలిసి ఎకరానికి 57 మొక్కల చొప్పున ఆయిల్ పామ్ మొక్కలు నాటారు. అనంతరం జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి మాట్లాడుతూ… వరి పంటకు ప్రత్యామ్నాయంగా అధిక దిగుబడి, ఆదాయాన్ని అందించే సులభతరమైన వాణిజ్య పంట అయిన ఆయిల్ పామ్ పంట సాగు ఎందుకు చేయాలో రైతులకి వివరించారు.
ఎకరానికి వరి పంట మీద రెండు సీజన్లకు కలిపి సంవత్సరానికి కేవలం రూ.25 వేల నుండి రూ.30 వేల మాత్రమే నికర ఆదాయం వస్తుందన్నారు. అదే ఆయిల్ పామ్ మొక్కలు ఒకసారి నాటితే 4వ సంవత్సరo పంట మొదలై ఆపై 6వ సంవత్సరo నుండి నిర్విరామంగా 30 సంవత్సరాల వరకు సరాసరిన ఎకరానికి 10 నుండి 12 టన్నుల దిగుబడిని తీసుకోవచ్చు అన్నారు. ఎకరానికి లక్ష ఇరవై వేల నుండి లక్ష యాభై వేల వరకు నికర ఆదాయాన్ని పొందవచ్చు అని తెలిపారు. ప్రభుత్వం నుండి ఈ పంట సాగుకు వందకు రాయితీతో మొక్కలు సరఫరా చేస్తూ, మొక్కకు నీరు అందించే డ్రిప్ పరికరాలకు కూడా రాయితీ అందిస్తుందన్నారు. అలాగే మొదటి నాలుగు సంవత్సరాలకి మొక్కల యాజమాన్యానికి, అంతరపంట నిర్వహణకి ఎకరానికి రూ.4,200 చొప్పున ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రైతు ఖాతాలో జమ చేయబడుతుందన్నారు.
భూమి, నీటి వనరులు ఉన్న ప్రతీ రైతు సాంప్రదాయ వ్యవసాయ పంటల నుండి ఆయిల్ పామ్, ఉద్యాన పంటల వైపు రావాలని ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి సూచించారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక ఉద్యాన అధికారి వై.శ్యాంసుందర్రెడ్డి, ఆయిల్ పామ్ కంపెనీ డీజీఎం యాదగిరి, ప్రతినిధులు రవీందర్రెడ్డి, అశోక్, మనోహర్, డ్రిప్ కంపెనీ ప్రతినిధులు, గ్రామ ఆదర్శ రైతులు శేఖర్, పల్రెడ్డి రాంరెడ్డి, మాజీ సర్పంచ్ యాదయ్య, పలువురు రైతులు పాల్గొన్నారు.