అనంతగిరి, ఆగస్టు 04 : తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా అనంతగిరి మండలంలోని శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం చిన్నారులకు సామూహిక అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ సూపర్వైజర్ రజిని, స్థానిక సర్పంచ్ వాడకొప్పుల ఉమ హాజరై 6 నెలలు నిండిన చిన్నారులకు తొలిసారి అన్నం తినిపించారు. అనంతరం వారు మాట్లాడుతూ… ఆరోగ్యవంతమైన పిల్లల కోసం తల్లిపాలతో పాటు 6 నెలల తర్వాత తప్పనిసరిగా అనుబంధ ఆహారం ప్రారంభించాలన్నారు. పిల్లలు పుట్టిన గంటలోపు తల్లిపాలు ఇవ్వడం, 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. తల్లిపాలే ఉత్తమమైన ఆహారమని పిల్లలకు రెండు సంవత్సరాల వరకు పాలు ఇవ్వవచ్చని చెప్పారు. చిన్నారుల బరువు, ఎత్తు నమోదు చేసి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు, తల్లులకు అందిస్తున్న సేవలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సుబ్బలక్ష్మి, ఆశా వర్కర్లు, ఆయాలు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.