హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా చేపట్టనున్న ఎన్టీపీసీ రెండోదశ ప్రాజెక్టు నుంచి విద్యుత్తు కొనుగోలు విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎటూ తేల్చడంలేదు. 2400 (3×800) మెగావాట్ల విద్యుత్తుకు సంబంధించి ప్రభుత్వం పీపీఏ (పవర్ పర్చేజ్ ఎగ్రిమెంట్) చేసుకుంటే వెంటనే ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడతామని ఎన్టీపీసీ పదేపదే లేఖలు రాస్తున్నా రాష్ట్ర సర్కారు నుంచి స్పందన రావడంలేదు. దీంతో ఎన్టీపీసీ గత ఫిబ్రవరి 10వ తేదీలోగా ఏదో ఒకటి తేల్చాలని గడువుగా నిర్ణయించింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. దీంతో ఎన్టీపీసీ ఇతర రాష్ర్టాలకు విద్యుత్తును విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ మేరకు సీనియర్ పాత్రికేయుడు ఇనగంటి రవికుమార్ సమాచార హక్కు చట్టం ద్వారా ఎన్టీపీసీ నుంచి సేకరించిన వివరాలను వెల్లడించారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం.. తెలంగాణ భవిష్యత్తు అవసరాల కోసం ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టును ఏర్పాటుచేసి అందులో 85 శాతం విద్యుత్తును రాష్ట్ర అవసరాలకు కేటాయించాలి.
మొదటిదశలో 1600 (2×800)మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టు పూర్తికావడంతో ఇటీవలే దాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. రెండోదశ ప్రాజెక్టు కోసం ఫీజిబులిటీ రిపోర్టుకు కేంద్రం ఇదివరకే ఆమోదం తెలపగా, శక్తి పథకం కింద సింగరేణి ద్వారా కోల్ లింకేజీకి స్టాండింగ్ లింకేజీ కమిటీ(లాంగ్ టర్మ్) ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు కొనుగోలుకు ఒప్పందం చేసుకుంటే ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 2023 నుంచి ఈ ఏడాది జనవరి 29వ తేదీ వరకు పీపీఏ కోసం ఎన్టీపీసీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మూడు లేఖలు రాసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. జనవరి 29న తెలంగాణకు ఎన్టీపీసీ చివరి లేఖ రాస్తూ, ఫిబ్రవరి 10వ తేదీలోగా స్పందించకపోతే ఇతర రాష్ర్టాలతో ఒప్పందం చేసుకుంటామని స్పష్టంచేసింది. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ… ఫిబ్రవరి చివరికల్లా ఒప్పందం చేసుకుంటామని తెలిపింది. అయినా ఈ నెల 20 వరకూ పీపీఏకు ముందుకు రాలేదు. దీంతో చేసేదిలేక ఎన్టీపీసీ ఇతర రాష్ర్టాలకు ఆఫర్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తున్నది.