హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): ప్రతి మహిళకు కాంగ్రెస్ సర్కార్ రూ.35 వేల చొప్పున బాకీ పడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ‘ప్రతి మహిళకు నెలకు రూ.2,500 చొప్పున నగదు ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని తెలిపారు. అధికారంలోకి వచ్చే 14 నెలలు గెలిచినా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ 14 నెలల నగదు రూ.35 వేల చొప్పున మహిళా దినోత్సవంలోపు ఇచ్చిన తన హామీని నెరవేర్చాలని కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి మహిళా విభాగం ప్రతినిధులతో మంగళవారం తన నివాసంలో ఆమె సమావేశమయ్యారు.
మహిళలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విషయంపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో పోరాడుతామని హెచ్చరించారు. మహిళా దినోత్సవంలోపు హామీ ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని అల్టిమేటం జారీచేశారు. కేసీఆర్ పాలనలో మహిళలకు పెద్దపీట వేశామని, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి మహిళలను చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు.
కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తామన్న హామీ, ఆడపిల్లలందరికీ ఉచితంగా సూటీలు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని కల్వకుంట్ల కవిత నిలదీశారు. మహిళలకు ఉచిత బస్సు పెట్టి మిగతా పథకాలను తుస్సుమనిపించారని ఎద్దేవా చేశారు. తాము మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణాన్ని స్వాగతిస్తున్నామని, అదే సమయంలో ప్రభుత్వం మరిన్ని బస్సు సర్వీసులను పెంచి ప్రజారవాణాను సులభతరం చేయాలని సూచించారు.
కేవలం మహిళలనే కాకుండా అన్నివర్గాలకు సీఎం రేవంత్రెడ్డి ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. మహిళల పేరిట ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఆ ప్రక్రియనే మొదలు పెట్టలేదని ఎత్తిచూపారు. సంక్రాంతికి సన్నబియ్యం ఇస్తామని ఇప్పటికీ ఇవ్వకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఆసరా పింఛన్ సొమ్మును నాలుగు వేలకు పెంచాలన్నారు.