Telangana | హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): అంతా అయిపోతున్నది.. ఇప్పటి వరకు తెలంగాణ అవసరాలకు అండగా ఉన్న జల విద్యుత్తు కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లబోతున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్తోపాటు నాగార్జుసాగర్ లెఫ్ట్ కెనాల్ పవర్హౌజ్ కూడా కృష్ణా బోర్డు అజమాయిషీకి చేరనున్నాయి. రాష్ట్రంలో విద్యుత్తు వ్యవస్థలను కాపాడుకుంటూ, బలోపేతం చేయటంపై గత ప్రభుత్వం దృష్టిసారిస్తే, కొత్తగా వచ్చిన ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా ససేమిరా అంటూ తొమ్మిదేండ్లు పోరాడిన ఫలితం.. ఇప్పుడు నీరుగారిపోతున్నది. తాజాగా కేంద్ర జల్ శక్తి వనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిలోకి ప్రాజెక్టులతోపాటు జల విద్యుత్తు కేంద్రాలనుకూడా తీసుకురావడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది. అంటే మన జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను కృష్ణా బోర్డుకు అప్పగించే తరుణం త్వరలోనే ఉన్నదనే చెప్పవచ్చు. ఇలా జరిగితే.. తెలంగాణ జల విద్యుత్తు కేంద్రాలు అటకెక్కినట్టే. మన ప్రభుత్వానికి విద్యుత్తు విషయంలో భారీ నష్టం తప్పదు. గ్రిడ్ వైఫల్యం చెందే ప్రమాదం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు కేవలం జల విద్యుత్తు ఉత్పత్తి కోసమే నిర్మించింది. రికార్డుల్లో జల విద్యుత్తు కోసమే అని స్పష్టంగా ఉంటుంది కూడా. దీని వల్ల 264 టీఎంసీల నీటిని దిగువన ఉన్న సాగర్ రిజర్వాయర్లోకి విడుదల చేస్తూ జల విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. కాలగమనంలో సీమాంధ్ర పాలకులు శ్రీశైలానికి పోతిరెడ్డిపాడు వద్ద బుంగ పెట్టి క్రమంగా జల విద్యుత్తుకు అడ్డంకులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుత్తు కోసమే కాబట్టి ఇక్కడ తెలంగాణకు శ్రీశైలం(ఎడమగట్టు) జల విద్యుత్తు కేంద్రంలో 900 మెగావాట్లుతోపా టు.. నాగార్జునసాగర్ జల విద్యుత్తు కేంద్రం 815.6 మెగావాట్లు, సాగర్ లెఫ్ట్ కెనాల్పై ఉన్న జలవిద్యుత్తు కేంద్రం 60 మెగావాట్ల జల విద్యు త్తు ఉత్పత్తి అనేది పూర్తిగా సందిగ్దంలో పడింది.
తెలంగాణ జల విద్యుత్తు కేవలం కృష్ణా నదిపైనే కేంద్రీకృతమై ఉన్నది. రాష్ట్రంలో మొత్తం 2,441.76 మెగావాట్ల జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు ఉండగా, కృష్ణా నదిపైనే జూరాల (234 మెగావాట్లు), శ్రీశైలం (900 మెగావాట్లు), సాగర్ లెఫ్ట్ కెనాల్ (60 మెగావాట్లు), నాగార్జునసాగర్ (815.6 మెగావాట్లు), లోయర్ జూరాల (240 మెగావాట్లు), పులిచింతల (120 మెగావాట్లు) ద్వారా మొత్తం 2,369.6 మెగావాట్ల జల విద్యుత్తు కేంద్రాలు ఉన్నాయి. ఇందులో శ్రీశైలం, నాగార్జునసాగర్, సాగర్ లెఫ్ట్ కెనాల్పై ఉన్న 1,775.6 మెగావాట్ల జల విద్యుత్తు కేంద్రాలు కేఆర్ఎంబీ చేతిలోకి వెళ్లిపోతాయి. 594 మెగావాట్ల ప్రాజెక్టులు మాత్రమే మన జెన్కో ఆధీనంలో ఉంటాయి. ఇందులోనూ సగం విద్యుత్తు కర్ణాటకకు (ఒప్పందం ప్రకారం) ఇవ్వాల్సి ఉంటుంది. గోదావరి నదిపై ఉన్న 72.16 మెగావాట్ల చిన్న జల విద్యుత్తు ప్లాంట్లపై మాత్రమే మన ప్రభుత్వ అజమాయిషీ ఉంటుంది.
ప్రాజెక్టుల నిర్వహణతోపాటు జల విద్యుత్తు ఉత్పత్తి చేయాలా? వద్దా? అనేది కేఆర్ఎంబీ నిర్ణయిస్తుంది. గత పదేండ్ల పాటు వర్షాకాలంలో వరద ప్రారంభమైన వెంటనే శ్రీశైలంలోని జల విద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ దిగువన ఉన్న నాగార్జునసాగర్లోకి వదిలేవారు. ఇక నుంచి ఎప్పుడు నీటిని వదలాలి? ఎప్పుడు జల విద్యుత్తు ఉత్పత్తి చేయాలి? అనేది కేఆర్ఎంబీనే నిర్ణయిస్తుంది. అంటే తెలంగాణ అవసరాలతో పనిలేకుండా కేఆర్ఎంబీ తన పని తాను చేసుకుపోతుందన్నమాట. ఈ లెక్కన సగటున ఏటా 5,000 మిలియన్ యూనిట్ల వరకు జల విద్యుత్తుపై ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది. యూనిట్కు రూ.2.50 వరకు ఖర్చు అవుతుంది. బయటి మార్కెట్లో కొంటే కనిష్ఠ ధర రూ.5.50 వరకు ఖర్చు పెట్టాలి. అంటే రూ.3 చొప్పున అదనపు భారమే. ఇదంతా కలిసి ప్రభుత్వంపై ఏటా రూ.1,500 కోట్ల వరకు భారం పడుతుంది.
శ్రీశైలం, నాగార్జునసాగర్ జల విద్యుత్తు కేంద్రాలను ఆపత్కాలంలో ఆదుకునేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం మొన్నటి వరకు ఉపయోగించింది. కేంద్రం గ్రిడ్ గానీ, దక్షిణ ప్రాంతం గ్రిడ్ గానీ ప్రమాదంలో ఉందనే సంకేతాలు వెలువడిన వెంటనే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ) నుంచి గానీ, సదరన్ రీజినల్ పవర్ కమిటీ (ఎస్ఆర్పీసీ) నుంచి గానీ వచ్చే సూచనల ప్రకారం తెలంగాణ జెన్కో వెంటనే నిర్ణయం తీసుకుని గ్రిడ్ వైఫల్యం చెందకుండా శ్రీశైలం, నాగార్జునసాగర్ జల విద్యుత్తు కేంద్రాలను ఉపయోగించేది. ఇప్పుడు ఈ రెండు జల విద్యుత్తు కేంద్రాలు కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్తాయి. ఒకవేళ గ్రిడ్ వైఫల్యం చెందే ప్రమాదం పొంచి ఉంటే అనుకున్న వెంటనే నిర్ణయం తీసుకోవటం, అమలు చేయటం అంత సులువు కాదు. ఫలితంగా గ్రిడ్ వైఫల్యం చెందే ప్రమాదం పొంచి ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీ నిర్వహణలోకి ఇవ్వాలని 2021 జూలైలోనే కేంద్రం గెజిట్ ప్రచురించింది. అయినా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. అలా చేస్తే.. తెలంగాణ హక్కులను పణంగా పెట్టడమేనని స్పష్టం చేసింది. కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం తమ వాదనలను, రాష్ట్ర ప్రయోజనాలను గట్టిగా విన్పిస్తూ కేఆర్ఎంబీ అజమాయిషీని వ్యతిరేకిస్తూ వచ్చింది.తెలంగాణ జలవిద్యుత్తుకు
కేఆర్ఎంబీ గండం!
తాజాగా కాంగ్రెస్ సారథ్యంలో రా ష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఒకటిన్నర నెలలోనే ఢిల్లీ సమావేశంలో కేఆర్ఎంబీకి జల విద్యుత్తు ప్రాజెక్టులపై అజమాయిషీకి నిర్ణయం తీసుకోవటం కాంగ్రెస్, బీజేపీ మిత్రత్వంతోనే సాధ్యమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వాటి సాన్నిహిత్యంతోనే తెలంగాణ జల విద్యుత్తును, హక్కులను కేఆర్ఎంబీకి దఖలు పర్చేందుకు సిద్ధపడ్డారనే విమర్శలు చేస్తున్నారు. ఇన్నేండ్లు కాపాడుకుంటున్న వ్యవస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఇతర సంస్థలకు అప్పజెప్పడం ఏమిటని, రాష్ట్ర హక్కులను కాపాడేది ఎవరంటూ ప్రశ్నిస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సమావేశం ఈ నెల 29కి వాయిదా పడింది. ఈ మేరకు పీపీఏ.. తెలంగాణకు సమాచారం ఇచ్చింది. తొలుత పీపీఏ సమావేశం 22న నిర్వహించాలని నిర్ణయించారు. ఇదిలావుండగా, సమావేశ ఎజెండాలో పోలవరం బ్యాక్వాటర్ స్టడీస్, పీపీఏ ఆర్గనైజేషన్ బాడీలో తెలంగాణకు చోటు కల్పించడం, పోలవరం వద్ద వరద ప్రవాహాల డాటాను అందివ్వడం వంటి తదితర అంశాలను చేర్చాలని తెలంగాణ డిమాండ్ చేస్తూ వస్తున్నది. ఇటీవలనే పీపీఏకు లేఖ కూడా రాసింది.