హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి సగటున గంటకు రూ.13.6 కోట్ల చొప్పున రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం మోపుతున్నది. రాష్ట్ర ఆర్థిక రథాన్ని అప్పుల బాటలో పరుగులు తీయిస్తున్న ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ఆరంభం నుంచే భారీగా రుణాలను సమీకరిస్తున్నది. రోజుకు సగటున సుమారు రూ.328 కోట్లకు పైగా అప్పు చేస్తూ పరిపాలన సాగిస్తున్నది.
కేవలం ఏప్రిల్ నెలలోని మొదటి 21 రోజుల్లోనే ఏకంగా రూ.6,900 కోట్ల రుణాన్ని ఆర్బీఐ ద్వారా ఓపెన్ మారెట్ సేకరణ కింద తీసుకున్నది. ఈ నెలలో రెండు ప్రధాన విడతల్లో ప్రభుత్వం బాండ్ల వేలం ద్వారా ఈ నిధులను సేకరించింది. ఈ నెల 7న రెండు విడతల్లో కలిపి రూ.3,900 కోట్లు సేకరించింది. ఇందులో 17 ఏండ్ల కాలపరిమితికి రూ.2,000 కోట్లు (7.97% వడ్డీ), 30 ఏండ్ల కాలపరిమితికి రూ.1,900 కోట్లు (8.07% వడ్డీ) ఉన్నాయి. ఏప్రిల్ 21న మరో రూ.3,000 కోట్లు రుణంగా పొందింది. దీనిని మూడు విభాగాలుగా (7, 11, 21 ఏళ్ల కాలపరిమితితో) తలా రూ.1,000 కోట్ల చొప్పున సమీకరించింది
ఈ తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) రూ.18,900 కోట్లు రుణ సమీకరణ చేస్తామని ఆర్బీఐకి రాష్ట్ర ఆర్థికశాఖ ఇండెంట్ సమర్పించింది. ఇందులో భాగంగా ఇప్పటికే రూ.6,900 కోట్ల రుణ సమీకరణ చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఆర్బీఐ నుంచే ఓపెన్ మార్కెట్ రుణాలుగా రూ.85,840 కోట్లు అప్పు తీసుకున్నది. గత ఏడాది బడ్జెట్ అంచనాల్లో రుణ సమీకరణ రూ.54.009 కోట్లు ప్రతిపాదించింది. కానీ, రూ.85,840 కోట్లు.. అంటే 158.93 శాతం అప్పు తీసుకున్నది. 2026-27లో రూ.80,000 కోట్ల రుణ సమీకరణ చేస్తామని తాజా బడ్జెట్లో ప్రతిపాదించింది.
ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల అమలుకు, పాత అప్పుల వడ్డీల చెల్లింపులకు నిధుల కొరత వేధిస్తుండటంతో, సరార్ మారెట్ రుణాలపైనే ఎకువగా ఆధారపడుతున్నట్టు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు వారాల్లోనే దాదాపు 7 వేల కోట్ల మేర అప్పు చేయడం రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుపై చర్చకు దారితీస్తున్నది. రోజుకు రూ.328 కోట్ల అప్పు అంటే, ప్రతి గంటకు రాష్ట్రం సుమారు రూ.13.6 కోట్ల రుణభారాన్ని తెలంగాణ ప్రజలపై మోపుతున్నది. ఇదే వేగం కొనసాగితే రాబోయే రోజుల్లో రాష్ట్ర ఖజానాపై వడ్డీల భారం మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉన్నది.
