రవీంద్రభారతి, ఏప్రిల్ 14: మాదిగలను కాంగ్రెస్ పార్టీ గత 75 ఏండ్లుగా మోసం చేస్తూనే ఉన్నదని మాదిగ రాజ్యాధికార పోరాట సమితి అధ్యక్షుడు తిమ్మన నవీన్రాజ్ మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని కమిటీ వేసి అబద్ధ వాగ్దానాలతో మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలను గ్రామాలకు రానివ్వకుండా తిరుగుబాటు చేయాలని మాదిగ జాతికి పిలుపునిచ్చారు.ఈ ఆదివారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నవీన్రాజ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేవెళ్ల డిక్లరేషన్లో మాదిగలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి కుట్రపూరితమైన వాగ్దానాలతో మాదిగ జాతిపై కుట్రచేస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి మాదిగలతోనే తాను గెలిచానని ఎన్నో సభల్లో చెప్పి ఇప్పడు మాదిగలకే ద్రోహం తలపెడుతున్నారని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాదిగ రాజ్యాధికార పోరాట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లగుట్ట నర్సింహమాదిగ, రవీందర్మాదిగ, ఎల్లేశ్, శివ, కిశోర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.