హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై పెట్టిన కేసును సీఐడీకి ఎందుకు అప్పగించారని, ఆయన ఏదైనా కుంభకోణానికి పాల్పడ్డారా? లేక దొంగతనం చేశారా? అని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణభవన్లో బుధవారం ఆయన ఎమ్మెల్యే కౌశిక్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్టుల పర్వం జోరుగా కొనసాగుతున్నదని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆరోపించారు. కౌశిక్రెడ్డి స్థానిక ఎమ్మెల్యేగా వీణవంక సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రొటోకాల్ పాటించాలని మాత్రమే అడిగారని గుర్తుచేశారు. ప్రొటోకాల్ను ఉల్లంఘించడమే కాకుండా పోలీసులు కౌశిక్రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేశారని చెప్పారు. కరీంనగర్ పో లీస్ కమిషనర్ మత మార్పడులకు పాల్పడుతున్నారని కౌశిక్రెడ్డి ఎక్కడా వ్యాఖ్యానించలేదని గంగుల అన్నారు. ఐపీఎస్ అధికారుల సంఘం ఇచ్చిన స్టేట్మెంట్ను కౌశిక్రెడ్డి అప్పుడే ఖండించారని గుర్తుచేశారు. కౌశిక్రెడ్డిపై సీఐడీ విచారణ పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేశారు. ఎ వరి మీద కౌశిక్రెడ్డి ఆరోపణలు చేశారని చెప్తున్నారో.. వారితో సీఐడీ విచారణ జరిపిస్తే న్యా యం ఎలా జరుగుతుంది? అని ప్రశ్నించారు.
ఆ ముగ్గురు పోలీసులను అరెస్టు చేయాలి
తనను అడ్డుకున్న పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని, లేదా వారు తనకు క్షమాపణ చెప్పాలని కౌశిక్రెడ్డి డిమాండ్చేశారు. ఎవరినీ విడిచిపెట్టేది లేదని చెప్పారు. హుజూరాబాద్ మున్సిపాలిటీలో సీనియర్ కాంగ్రెస్ నేత ఖలీద్కు వైస్చైర్మన్ పోస్టు ఎందుకు ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీని సూటిగా ప్రశ్నించారు. జమ్మికుంట ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వీణవంక ప్రజలను సీఐడీ విచారిస్తే అసలు నిజం తెలుస్తుందని చెప్పారు. వెంటనే కరీంనగర్ సీపీ, హుజురాబాద్ ఏసీపీ, జమ్మికుంట సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
మతమార్పిడి వ్యాఖ్యలు నిరూపిస్తే రాజీనామా: కౌశిక్రెడ్డి
మతమార్పిడి చేస్తున్నారని తాను అన్నట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాకుండా, రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటానని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సవాల్చేశారు. గద్దెల వద్దకు తాను 50 మందితో వచ్చినట్టు పోలీసులు చేస్తున్న అసత్యపు ప్రచారాలను ఆయన ఖండించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి వీణవంకకు వెళ్తుంటే తననెందుకు పోలీసులు అడ్డుకున్నారని సూటిగా ప్రశ్నించారు. సమ్మక్క సారలమ్మ జాతర సమయంలో తమ తల్లిదండ్రులను హౌస్ అరెస్టు చేశారు అని ధ్వజమెత్తారు. తన భార్య, కూతురు, దళిత సర్పంచ్ నలుగురం మాత్రమే దర్శనం కోసం గద్దెల వద్దకు చేరుకున్నామని, అయినా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు కరీంనగర్ సీపీ తనను ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. తాను ము స్లింలను తిట్టినట్టు కాంగ్రెస్ వాళ్లు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.