Praja Palana | బాన్సువాడ : పార్లమెంటు ఎన్నికల వరకు కాలయాపన చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరిస్తుందని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కాలయాపన చేయకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో గురువారం పాల్గొన్న ఆయన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారని.. ఇంతవరకు దాని ప్రస్తావనే లేదని అన్నారు. పంట పెట్టుబడి కింద రూ.15వేలు అందిస్తామన్నారని.. పాత పద్ధతిలో రూ.10వేలకు కూడా దిక్కులేదని ఎద్దేవా చేశారు. గృహాజ్యోతి ఊసే లేదని అన్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి హామీ ఇవ్వలేదని అన్నారని.. కానీ ప్రియాంక గాంధీ సభలో నిరుద్యోగ భృతి గురించి చెప్పిన ఆధారాలు ఉన్నాయని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో డబ్బులు అయిపోయాయని చెబుతున్నారని.. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఆదాయం పెంచాలని, దాన్ని ప్రజలకు పంచాలని సూచించారు. గత ప్రభుత్వంలో కల్యాణలక్ష్మీ, ఆసరా పింఛన్లు, పాఠశాలలు, రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలను ఎక్కడా ఆపలేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వంపై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.