హైదరాబాద్, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ) : యాసంగి పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు కాంగ్రెస్ సర్కార్ మరోసారి మొండిచేయి చూపించింది. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రైతుభరోసాపై నిర్ణయం తీసుకుంటారని అంతా భావించినా.. ఎలాంటి చర్చ లేకుండానే ము గించేశారు. అలాగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపైనా చర్చకు రాకపోవడంతో ఇప్పట్లో పరిషత్ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని ప రోక్షంగా తేల్చి చెప్పింది.
సచివాలయంలో సోమవారం జరిగిన క్యా బినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి 16 నుంచి 30వ తేదీ వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభు త్వం నిర్ణయించింది. 16న గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు మొదలుకానున్నా యి. 20న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2026-27 బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఖరారు చేసిన బడ్జెట్ సమావేశాల తేదీలపై గందరగోళం నెలకొన్నది. బడ్జె ట్ సమావేశాల తేదీల్లో ముఖ్యమైన పండుగ లు రావడమే ఇందుకు కారణం. ఈ నెల 16న రాజ్యసభ ఎన్నికలు జరుగనుండగా, అదే రోజు శాసనసభలో ప్రభుత్వం గవర్నర్ ప్రసంగానికి ఏర్పాటు చేసింది. రెండు ముఖ్యమైన కార్యక్రమాలు ఎలా సాధ్యమవుతాయనే చర్చ జరుగుతున్నది. ఇక మార్చి 20న బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించగా, అదే రోజు రంజాన్ పండుగ ఉండే అవకాశం ఉన్నది. ఒకవేళ నెలవంక కనిపించడం ఆలస్యమైతే రంజాన్ పండుగ 21న జరుగుతుంది. లేకపోతే 20వ తేదీనే రంజాన్ వస్తే పరిస్థితి ఏమిటనే చర్చ జరుగుతున్నది. ఇక 19న ఉగాది, 27న శ్రీరామ నవమి పండుగలు ఉండగా, ఇన్ని పండుగల మధ్య బడ్జెట్ సమావేశాలు ఏ విధంగా నిర్వహిస్తారనే చర్చనీయాంశమైంది.
ప్రభుత్వం పేరుకే 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెబుతున్నా.. ఇందులో సగం రోజులు పండుగలు, ఆదివారాల పేరుతో సెలవులకే పోతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజులు సభలో ఎలాంటి చర్చ జరుగని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బడ్జెట్ సమావేశాల్లో ప్రజాసమస్యలపై చర్చించేందుకు సమయం ఉండే అవకాశం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్కు ప్రజాసమస్యలపై ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా ఉండేందుకే ప్రభుత్వం సమావేశాల తేదీలను ఖరారు చేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల అమరావతి వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబును కలిసి వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం ఆసక్తికరంగా మారింది. సహచర మంత్రులు ఆయన కోసం 45 నిమిషాలపాటు వేచిచూసినట్టు తెలిసింది. అప్పటికీ ఆయన రాకపోవడంతో సీఎం రేవంత్ సమావేశాన్ని ప్రారంభించినట్టు తెలిసింది. తుమ్మలకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో సమావేశానికి గైర్హాజర్ అయినట్టు తొలుత ప్రకటించినట్టు తెలిసింది. ఆ తరువాత కొద్దిసేపటికి రాష్ట్రంలోనే అందుబాటులో లేరని, విదేశాలకు వెళ్లారని మంత్రుల మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. ముఖ్యమంత్రికి సమాచారం లేకుండా మంత్రి విదేశాలకు వెళ్తారా? అసలు ఏమైంది? అని మంత్రు ల మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది.