హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని అప్పుల ఊబిలో దింపడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో రూ.2,000 కోట్ల రుణ సమీకరణకు సిద్ధమైంది. 16న సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొని రుణాన్ని సేకరిస్తామని ఆర్థిక శాఖ తమకు ప్రతిపాదనలు పంపినట్టు ఆర్బీఐ వెల్లడించింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) లో రూ.18,900 కోట్ల రుణాలు సమీకరిస్తామని ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపిన రాష్ట్ర ప్రభుత్వం.. ఏప్రిల్లో రెండు విడతలుగా రూ.6,900 కోట్లు, మే లో రెండు దఫాలుగా రూ.6 వేల కోట్లు, జూన్ 2న మరో రూ.4 వేల కోట్లు కలిపి రూ.16,900 కోట్ల అప్పులు తెచ్చింది. మిగిలిన రూ.2 వేల కోట్ల రుణాన్ని మంగళవారం సమీకరించనున్నది. రేవంత్ ప్రభుత్వం ప్రతినెలా 6వేల కోట్లకుపైగా అప్పులు తెచ్చి కాలం వెళ్లదీస్తున్నట్టు స్పష్టమవుతున్నది.
