చేర్యాల, ఆగస్టు 20 : కడుపులో విషం పెట్టుకుని కాళేశ్వరంపై సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులు దుష్ర్పచారం చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసత్య ప్రచారాలను బీఆర్ఎస్ క్యాడర్ బలంగా తిప్పికొట్టాలని, ఈ విషయంలో ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ తెలంగాణను దేశంలోనే అగ్రస్థ్ధానంలో నిలిపితే.. సీఎం రేవంత్రెడ్డి ప్రజలను నమ్మబలికి నిండాముంచారని మండిపడ్డారు. బుధవారం సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని రేణుకా గార్డెన్స్లో చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తానని బాండ్ పేపర్లు రాసిచ్చిన సీఎం రేవంత్, ఎందుకు వాటిని అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను ముంచినట్టు విమర్శించారు. రైతులకు యూరియా ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నదని దుయ్యబట్టారు. అన్నిరంగాల్లో సర్కార్ విఫలమైందని అన్నారు. ఎనిమిది మంది కాంగ్రెస్, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నా, వారికి తెలంగాణ ప్రయోజనాలు పట్టడం లేదని మండిపడ్డారు. రేవంత్రెడ్డి నోరు తెరిస్తే అబద్ధ్దాలు మాట్లాడటం, కేసీఆర్పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ సర్కార్ మూడున్నర లక్షలకోట్ల అప్పుచేస్తే, రెండేండ్లు కాకముందే రేవంత్ ప్రభుత్వం రూ.2 లక్షల కోట్ల అప్పు చేసిందని అన్నారు. అప్పు చేసిన డబ్బులతో తెలంగాణలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించారని, రైతుబంధు ఇచ్చారని, చనిపోయిన రైతుల బీమా ఇచ్చారని, యాదాద్రి నిర్మించారని, కొత్తగా రోడ్లు నిర్మించినట్టు చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ ఏం నిర్మించిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
నియోజకవర్గంలోని తపాస్పల్లి, లద్నూరు రిజర్వాయర్లను నింపి చెరువుల్లోకి నీటిని పంపింగ్ చేస్తే రైతులు పంటలు పండించుకునే వారని ఎమ్మెల్యే పల్లా తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఏం రోగం వచ్చిందో కానీ రిజర్వాయర్లు, చెరువులు ఎండబెట్టిందని ఆవేదన వ్యక్తంచేశారు. రిజర్వాయర్లు నింపి చెరువులకు నీటిని పంపింగ్ చేయాలని తాను విశ్రాంతిలో ఉన్నప్పటికి ఎప్పటికప్పుడు సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి నీటిని పంపింగ్ చేయించినట్టు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఇండ్లు ఉన్నవారికే ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తే, తాను పేద వారికి కేటాయించినట్టు గుర్తుచేశారు. కాంగ్రెస్ వారు ఇచ్చిన ఇండ్ల నిర్మాణాలు 25శాతం ప్రారంభిస్తే, ఎమ్మెల్యేగా తాను మంజూరు చేయించిన ఇండ్లు 95శాతం మంది లబ్ధిదారులు ప్రారంభించినట్టు చెప్పారు.
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను గడగడపకూ ప్రచారం చేయాలని, ఎంపీటీసీ, సర్పంచ్, జడ్పీటీసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో సైనికుల వలే పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇక అధికార పార్టీ చేస్తున్న అక్రమాలు, అన్యాయాలపై యుద్ధ్దం చేస్తానని ప్రకటించారు. తన సొంత దవాఖాన నీలిమలో నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తానని తెలిపారు. తొలుత పల్లా రాజేశ్వర్రెడ్డి ఎర్రవల్లిలో కేసీఆర్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకుడు రాకేశ్రెడ్డి, ముస్త్యాల బాల్నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.