Free Coaching | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : ఉస్మానియా యూనివర్సిటీలోని గ్రూప్-1, గ్రూప్-2 ఉచిత శిక్షణ కోచింగ్ను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నది. దీంతో నిరుపేద నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సివిల్ సర్వీసెస్తో పాటు గ్రూప్-1, గ్రూప్-2 అభ్యర్థులకు ఓయూతో కేయూ, ఎంజీయూ, శాతవాహన వంటి పలు ప్రభుత్వ యూనివర్సిటీలలో ఉచిత కోచింగ్ విధానాన్ని గత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నిరుపేద అభ్యర్థులు సివిల్ సర్వీసులతో పాటు గ్రూప్స్ ఉద్యోగాలు సాధించే విధంగా ఈ ఉచిత కోచింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉచిత కోచింగ్ను ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దాదాపు 2000 మంది అభ్యర్థుల సామర్థ్యంతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కోచింగ్ నిర్వహణపై ప్రభుత్వం కన్నెత్తి కూడా చూడటం లేదు. ఫలితంగా నిధులు, సౌకర్యాల లేమితో 200 మంది అభ్యర్థులకు మాత్రమే శిక్షణ ఇస్తున్నారు. వీరిలో ఓయూకు చెందిన వారు 100 మంది కాగా, మిగిలిన వందమంది బీసీ స్టడీ సర్కిల్కు చెందినవారు ఉన్నారు. ఈ వందమంది అభ్యర్థులను కూడా మెరిట్ ఆధారంగా ఎంపిక చేసినట్టు సంబంధిత అధికారులు చెప్తున్నారు.
ఈ ఉచిత కోచింగ్ కేంద్రాన్ని ఆనాటి ప్రభుత్వం ప్రారంభించడంతోపాటు అభ్యర్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తెచ్చింది. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకొచ్చి, ఉచిత కోచింగ్ విధానానికి మంగళం పాడింది. పైగా సివిల్ సర్వీసెస్ కోచింగ్ కూడా నామమాత్రంగానే నడుస్తున్నది. ఈ కోచింగ్ కేంద్రంలో అర్థమేటిక్, రీజనింగ్, స్పోకెన్ ఇంగ్లిష్ వంటి సబ్జెక్టులకు మాత్రమే ఉచితంగా బోధిస్తున్నారు. మిగితా సబ్జెక్టులు గాలికొదిలేశారు. మళ్లీ సివిల్స్ అభ్యర్థులు వేలాది రూపాయలు వెచ్చించి.. ప్రైవేటు కోచింగ్ కేంద్రాలను ఆశ్రయించక తప్పడం లేదు. డబ్బులు లేని వారు ఇంట్లోనే సొంతంగా చదువుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే, ఎలాంటి ఆర్థిక స్థోమత లేని వాళ్లు మాత్రమే ఉచిత కోచింగ్ ఆశ్రయిస్తున్నారన్న అంశాన్ని అధికారులు సర్వత్రా విస్మరిస్తున్నారని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సివిల్ సర్వీసెస్ అభ్యర్థులతో పాటు గ్రూప్-1, గ్రూప్-2 వరకు అన్ని రకాల ఉద్యోగ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించిన మాట వాస్తవమే. కాని, ప్రస్తుతం ఉచిత కోచింగ్ కేంద్రాన్ని నడిపించడానికి నిధుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే.. సివిల్స్తో పాటు గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3తో పాటు అధ్యాపకులు, ఉపాధ్యాయులు, పోలీసు వంటి అన్ని రకాల క్యాటగిరీ పోస్టులకు ఉచిత కోచింగ్ను అందుబాటులోకి తెస్తాం.
– ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్