Congress | హైదరాబాద్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ): ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ హామీ అమలుకు నోచుకోవడం లేదు. ఓ వైపు యాసంగి ధాన్యం కొనుగోళ్లు మొదలైనా బోనస్పై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ఇప్పటికే సాగు నీళ్లు కరువై పంటలు ఎండిపోతుంటే.. కనీసం బోనస్తోనైనా ఊరట లభిస్తుందనుకున్న రైతులకు నిరాశే మిగులుతున్నది. అధికారంలోకి రాగానే ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తామంటూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన కాంగ్రెస్ పార్టీ తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీపై నోరుమెదపడం లేదు. దీంతో రైతులు రూ. 500 బోనస్ ఎప్పుడిస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
వానకాలం తప్పించుకొని.. యాసంగికీ ‘హ్యాండ్’
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత డిసెంబర్లో కొలువుదీరే సమయానికి వానకాలం ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామన్న హామీని అమలు చేయాలని కోరగా.. ‘ఇప్పుడే కదా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.. యాసంగి సీజన్కు బోనస్ ఇస్తాం’ అంటూ ప్రభుత్వ పెద్దలు పేర్కొన్నారు. ఇప్పుడు యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. కానీ ఈ సీజన్లో కూడా ప్రభుత్వం ‘హ్యాండ్’ ఇస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏప్రిల్ ఒకటోతేదీ నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని ఇటు పౌరసరఫరాల సంస్థ, అటు ప్రభుత్వం ప్రకటించాయి తప్ప బోనస్పై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో వానకాలం మాదిరిగానే యాసంగి ధాన్యానికి కూడా ప్రభుత్వం బోనస్ ఇవ్వకుండా మొండిచెయ్యి చూపుతుందన్న విమర్శలు వస్తున్నాయి.
బోనస్పై సీఎం స్పందించరేం?
ధాన్యానికి రూ.500 బోనస్ ఇచ్చే విషయమై ఇప్పటివరకు సీఎం రేవంత్రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, ఇతర
నేతలెవరూ కనీసం స్పందించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే, రైతులకు ఇచ్చిన హామీ అంటే అంత చులకనా అని ప్రశ్నిస్తున్నారు.
రైతులకు రూ. 3750 కోట్ల నష్టం
కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం క్వింటాలు ధాన్యంపై రూ.500 బోనస్ ఇస్తే రైతులకు ఎంతో కొంత ఊరట లభించేది. కానీ ప్రభుత్వ తీరు చూస్తుంటే ఈ సీజన్లో బోనస్ అమలు కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ ఒక్క సీజన్లోనే రైతులు రూ.3750 కోట్లు నష్టపోనున్నట్టు అంచనా వేస్తున్నారు. ఈ యాసంగిలో పౌరసరఫరాల సంస్థ 75.4 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ లెక్కన క్వింటాలుకు బోనస్ రూ. 500 ఇస్తే మొత్తం 75.4 లక్షల టన్నులకు రైతులకు ప్రభుత్వం రూ. 3,750 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తం రైతులు నష్టపోయినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఛత్తీస్గఢ్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. ఇచ్చినహామీ మేరకు క్వింటాలు ధాన్యాన్ని రూ.3100కు కొనుగోలు చేస్తున్నది.
బోనస్ కోసం బీఆర్ఎస్ పోరుబాట
ధాన్యానికి రూ.500 బోనస్పై కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. రైతుల పక్షాన ప్రభుత్వంపై యుద్ధం చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. రైతులకు ఈ యాసంగి సీజన్ నుంచే రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోరుబాట పట్టింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కార్యాచరణ ప్రకటించారు. ఇందులో భాగంగా మంగళవారం అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ నేతలు ఆయా జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు. హైదరాబాద్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వనున్నారు. అప్పటికీ బోనస్పై ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే.. ఈ నెల 6న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన దీక్షలు చేపట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. అప్పుడు కూడా ప్రభుత్వం నుంచి స్పందనలేకపోతే కొనుగోలు కేంద్రాల్లోనే నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు.