Congress | (స్పెషల్టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తుండటంపై కర్ణాటకకు కన్ను కుట్టిందా? కళకళలాడుతున్న మన కరెంటును కొల్లగొట్టే కుట్ర జరుగుతున్నదా? రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాను 5 గంటలకు కుదించి, కర్ణాటకకు తరలించాలని చూస్తున్నదా? కాంగ్రెస్ నేతలు పదే పదే మూడు గంటల కరెంటుచాలని చెప్తుండటం వెనుక పెద్ద కుతంత్రమే ఉన్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్లోని ఫాక్స్కాన్ సహా పలు కంపెనీలను తమ రాష్ర్టానికి తరలించుకుపోయేందుకు ప్రయత్నించినట్టుగానే.. ఇక్కడి కరెంటునూ తరలించేందుకు కుట్ర పన్నుతున్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్కు కరెంటు తీసుకుపోయి ఛత్తీస్గఢ్, హిమాచల్లను కరెంటు సంక్షోభంలోకి నెట్టిన ఉదంతాలను వారు గుర్తుచేస్తున్నారు.
2019లో ఒకే ఒక్క ఒప్పందంతో ఛత్తీస్గఢ్ను విద్యుత్తు సంక్షోభంలోకి నెట్టేసింది కాంగ్రెస్. రాజస్థాన్ అవసరాలు తీర్చేందుకు ఛత్తీస్గఢ్ని బలిపెట్టింది. 2022లో అదే రాజస్థాన్ కరెంటు కరువు తీర్చేందుకు హిమాచల్ప్రదేశ్ను బలవంతంగా ఒప్పందంలోకి దించింది.ఆ తర్వాత హిమాచల్లోనూ కరెంటు కోతలు మొదలయ్యాయి. రాష్ర్టాల మధ్య కరెంటు తాకులాటలు పెట్టడం కాంగ్రెస్కు కొత్తకాదని, తనకు అక్కరకొచ్చే పెద్ద రాష్ర్టాల కోసం ఇతర రాష్ర్టాలను బలిపెట్టే దాని ధోరణికి ఉదాహరణలెన్నో ఉన్నాయని విద్యుత్తురంగ నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో కరెంటు కోతలు తీవ్రమైన దశలో.. పక్కన తెలంగాణ పచ్చగా కనబపడుతున్నది. 24 గంటల కరెంటుతో కళకళలాడుతుండటం కాంగ్రెస్ను ఊరిస్తున్నది. తెలంగాణను 5 గంటల కరెంటుకే కట్టడిచేసి.. ఆ దిశగా ప్రజల ఆలోచనను పరిమితం చేయాలని ప్రయత్నిస్తున్నది. కటకటాల కర్ణాటకకు వడ్డించేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తున్నది. కళకళలాడుతున్న తెలంగాణను అందుకు బలిపెట్టబోతున్నది.
పదేండ్ల కిందట కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ఎట్లుండె? ఎక్కడ చూసినా విద్యుత్తు కోతలే! గ్రామాల్లో 16 గంటలు, మండల కేంద్రాల్లో 12 గంటలు, జిల్లా కేంద్రాల్లో 10 గంటలు, రాజధాని హైదరాబాద్లో ఆరేడు గంటలపాటు కరెంటు పోయేది. పరిశ్రమలకు వారానికి రెండ్రోజులు పవర్ హాలిడేలు. సాగుకు 3 గంటల విద్యుత్తు ఇస్తే ఎక్కువ. అయితే, తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్పాలనలో తెలంగాణ స్థితిగతులే మారిపోయాయి. అన్నిరంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరా జరుగుతున్నది. అయితే, మరికొద్ది రోజుల్లో ఆ పరిస్థితులు ఉండకపోవచ్చు. వచ్చే ఎన్నికల్లో ఏమాత్రం ఆదమరిచి కాంగ్రెస్కు ఓటేసినా.. పదేండ్లకిందటి విద్యుత్తు కోతలే మళ్లీ దాపురించవచ్చు. మన కరెంటు పొరుగు రాష్ట్రం కర్ణాటకకు తరలిపోవచ్చు.
విద్యుత్తు కోతలతో కర్ణాటక కకావికలం
కాంగ్రెస్పాలనలో కర్ణాటక అస్తవ్యస్థంగా మారింది. విద్యుత్తు కోతలతో ప్రజలు, రైతులు, పారిశ్రామికవేత్తలు సతమతమవుతున్నారు. గృహ, వ్యవసాయ, పరిశ్రమలకు తగినంత విద్యుత్తు సరఫరా చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు కోతలకు తెగబడుతున్నది. ఐదు గ్యారంటీల్లో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పేరిట తీసుకొచ్చిన ‘గృహజ్యోతి’ స్కీమ్ ఎప్పుడో అటకెక్కింది. రాష్ట్రవ్యాప్తంగా 2.14 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తుందని అనుకున్న ఈ స్కీమ్.. కాంగ్రెస్ పెడుతున్న కొర్రీల కారణంగా కేవలం 8 లక్షల మందికే పరిమితమయ్యే ప్రమాదం ఏర్పడింది. రైతులకు సరిపడా విద్యుత్తు సరఫరా చేస్తామన్న కాంగ్రెస్.. 5 గంటల కరెంట్ కూడా ఇవ్వలేక చేతులెత్తేసింది. విద్యుత్తు కోతల కారణంగా పరిశ్రమలకు పవర్ హాలీడేలు ఇస్తున్నారు. కేవలం ఆరంటే ఆరునెలల్లోనే కర్ణాటకను విద్యుత్తు సంక్షోభంలోకి నడిపించిన కాంగ్రెస్.. ఇప్పుడు తెలంగాణవైపు చూస్తున్నది. లోపభూయిష్టమైన విద్యుత్తు ఒప్పందాలతో మిగులు విద్యుత్తు కలిగిన ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ర్టాలను కరెంటు ఒప్పందాలతో చీకట్లలోకి నెట్టేసిన కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణపై కన్నేసింది. ఇక్కడి కరెంటును కర్ణాటకకు తరలించేలా విద్యుత్తు సరఫరా ఒప్పందాన్ని తీసుకురావాలని ఆ పార్టీ యోచిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ, అదే జరిగితే కర్ణాటకలాగే తెలంగాణ కూడా ఆగమవడం ఖాయమని తెలంగాణవాదులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్కు ఓటేసి గెలిపిస్తే, తెలంగాణ చీకట్లోకి వెళ్లిపోవడం ఖాయమని వారు హెచ్చరిస్తున్నారు.
అంతటా అంధకారమే
ఒక రాష్ర్టాన్ని ఆదుకొంటున్నామన్న ముసుగులో మరో రాష్ర్టాన్ని కూడా ఊబిలోకి తోసేయడం కాంగ్రెస్కు అలవాటేనన్నది మొదటినుంచీ ఉన్న విమర్శే. అప్పటికే పీకల్లోతు విద్యుత్తు సంక్షోభంలో ఉన్న రాజస్థాన్ను ఆదుకొంటున్నామన్న సాకుతో 2019లో మిగులు విద్యుత్తు ఉన్న ఛత్తీస్గఢ్, 2023లో హిమాచల్ ప్రదేశ్ రాష్ర్టాలతో కాంగ్రెస్ లోపాయికారి విద్యుత్తు సరఫరా ఒప్పందాలను కుదుర్చుకొన్నది. తొలిదఫాలో వెయ్యి మెగావాట్లతో మొదలుపెట్టి క్రమంగా పలు దఫాల్లో 2,500 మెగావాట్లవరకూ ఒప్పందాన్ని సవరించింది. ఈ మూడు రాష్ర్టాల్లోనూ ఆ పార్టీనే అధికారంలో ఉండటంతో పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు. అయితే, తమ విద్యుత్తును తీసుకెళ్లొద్దంటూ ఛత్తీస్గఢ్, హిమాచల్ హక్కుల కార్యకర్తలు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఎన్నో విజ్ఞప్తులు చేశారు. అయినా సర్కారు పట్టించుకోలేదు. పైగా ఖజానాకు అదనపు ఆదాయం సమకూరడం ఇష్టంలేనివారే ఇలాంటి అడ్డంకులు సృష్టిస్తారని ఎదురుదాడికి దిగింది. ఫలితంగా రాజస్థాన్లో కరెంటు కష్టాలు తీరడం అటుంచితే.. ఇప్పుడు ఛత్తీస్గఢ్, హిమాచల్లోనూ విద్యుత్తు కోతలు మొదలయ్యాయి.
పక్క రాష్ర్టాల నుంచి విద్యుత్తు కొనుగోళ్లు జరిగినప్పటికీ.. రాజస్థాన్లో కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని జైపూర్ సహా ప్రధాన నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో విద్యుత్తు కోతలు నిత్యకృత్యంగా మారాయి. పరిశ్రమలకు వారానికి రెండురోజులు రాత్రిపూట విద్యుత్తు సరఫరాను నిలిపేస్తున్నారు. దీంతో మూడో షిఫ్ట్ను రద్దు చేసి పవర్ హాలిడే ఇవ్వాల్సి వస్తున్నదని పారిశ్రామికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాలూకా స్థాయిలో రోజుకు ఒక గంట (ఉదయం 7 నుంచి 8 గంటల వరకు) జిల్లా కేంద్రాల్లో రోజూ 2 గంటలు (ఉదయం 7 నుంచి 9 గంటల వరకు), మునిసిపాలిటీ కేంద్రాల్లో రోజుకు 3 గంటలతోపాటు 5 వేలకు మించిన జనాభా ఉన్న నగరాల్లోనూ రోజూ 3 గంటల (ఉదయం 6 నుంచి 9 గంటల వరకు)పాటు పవర్కట్ చేస్తున్నట్టు ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. జైపూర్, జోధ్పుర్, అజ్మీర్ లాంటి నగరాల్లో ఉదయం 7 నుంచి 8 గంటలవరకు అనధికారికంగా విద్యుత్తు కోతలు కొనసాగుతున్నాయి. వ్యవసాయానికి 6 గంటలకు బదులుగా 5 గంటలపాటే విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. హిమాచల్ప్రదేశ్లోని పట్టణాలు, గ్రామాల్లోనూ విద్యుత్తు కోతలు నిత్యకృత్యంగా మారాయి. ఛత్తీస్గఢ్లో విద్యుత్తు కోతలు ఎప్పుడు విధిస్తారో తెలియని పరిస్థితి నెలకొన్నది.
తెలంగాణపై కన్ను!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టగానే, కరెంటు సంక్షోభంలో ఉన్న కర్ణాటకకు తెలంగాణ నుంచి విద్యుత్తును సరఫరా చేసేలా కాంగ్రెస్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. కర్ణాటకలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొన్నటివరకూ సాగుకు 5 గంటల విద్యుత్తును సరఫరా చేసేందుకే అష్టకష్టాలు పడ్డ కర్ణాటక ప్రభుత్వపెద్దలు.. మరికొద్ది రోజుల్లో కరెంటు కష్టాలు తీరబోతున్నట్టు ఇటీవల తరుచూ చెబుతున్నారు. ఒకవేళ, కర్ణాటకలో విద్యుదుత్పత్తి పెరిగిందా? అంటే అదీ లేదు. కర్ణాటకలోని ఐదు ప్రధాన విద్యుత్తు ఉపకేంద్రాల్లో విద్యుదుత్పాదన ఇటీవల దారుణంగా పతనమైంది. జిందాల్లో సున్నా ఉత్పత్తి నమోదవగా.. ఆర్టీపీఎస్ (రాయచూరు), బీటీపీఎస్ (బళ్లారి), వైటీపీఎస్ (యరమరాస్)లో ఉత్పత్తి బాగా క్షీణించింది. యూటీపీపీ(ఉడుపి)లో ఉత్పాదన అంతంత మాత్రమే. మొత్తంగా ఐదు కేంద్రాల్లో రోజూ 7,680 మెగావాట్ల ఉత్పత్తి జరగాలి. అయితే ప్రస్తుతం కేవలం 2045 మెగావాట్ల విద్యుదుత్పత్తి మాత్రమే జరుగుతున్నది.
అలాగే 16 జలవిద్యుత్తు కేంద్రాల ద్వారా రోజూ 3,666.6 మెగావాట్లు విద్యుదత్పత్తి జరుగాల్సి ఉండగా, ప్రస్తుతం 205 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే ఉత్పత్తి అవుతున్నది. మరోవిషయం ఏమిటంటే, మూడేండ్లకుగాను స్పెషల్ పవర్ టారిఫ్ ప్లాన్ను తీసుకొస్తున్నట్టు ఇటీవలే కర్ణాటక సర్కారు ప్రకటన చేసింది. తగినంత విద్యుత్తు సరఫరా ఉన్నప్పుడు.. కరెంటు బిల్లులపై వినియోగదారులకు కచ్చితమైన అవగాహన ఉండటానికే మల్టీ-ఇయర్-టారిఫ్స్ (ఎంవైటీ)ని తీసుకొస్తారు. అయితే, కర్ణాటకలో విద్యుత్తు కోతలు కొనసాగుతున్న ఈ సమయంలో ఎంవైటీని ప్రభుత్వం తీసుకురావడం అనుమానాలకు తావిస్తున్నది. గతంలో ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్ప్రదేశ్ విషయంలో చేసినట్టుగానే, తెలంగాణ నుంచి కర్ణాటకకు విద్యుత్తును తీసుకుపోవడానికే కాంగ్రెస్ ప్లాన్ను సిద్ధంచేసిందని, అందుకనే, విద్యుత్తు సంక్షోభం తీరనున్నదంటూ కర్ణాటకలో కాంగ్రెస్పెద్దలు కచ్చితంగా చెబుతున్నట్టు విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదమరిచి కాంగ్రెస్కు ఓటేస్తే, వెలుగుల తెలంగాణ చీకట్లలో మగ్గాల్సిందేనని తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నారు.
అది 2018 సంవత్సరం..
రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి. ఇరు రాష్ర్టాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే, అప్పటికే రాజస్థాన్లో విపరీతమైన కరెంటు కోతలు. ఛత్తీస్గఢ్లో మాత్రం మిగులు విద్యుత్తు ఉన్నది. దీంతో 2019లో ఇరురాష్ర్టాల మధ్య విద్యుత్తు సరఫరా ఒప్పందాన్ని కాంగ్రెస్ ముందుకు తెచ్చింది. తమ విద్యుత్తును తీసుకుపోవద్దని ఛత్తీస్గఢ్ హక్కుల కార్యకర్తలు ఎంత మొరపెట్టుకొన్నా వినలేదు. ఫలితం ఇప్పుడు రాజస్థాన్లోనే కాదు.. ఛత్తీస్గఢ్లోనూ తీవ్రమైన విద్యుత్తు సంక్షోభం నెలకొన్నది.
అది 2022 సంవత్సరం..
హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తాము అధికారంలో ఉన్న రాజస్థాన్లో కరెంటు కోతలు ఇంకా కొనసాగుతుండటంతో.. ఈ ఏడాది ప్రథమార్థంలో హిమాచల్-రాజస్థాన్ మధ్య విద్యుత్తు సరఫరా ఒప్పందాన్ని కాంగ్రెస్ తెరమీదికి తెచ్చింది. రాజస్థాన్కు.. హిమాచల్ ప్రభుత్వం కరెంటు ఇవ్వడమే దీని ముఖ్యోద్దేశం. మూడు నెలలు గడిచాయి. ఇప్పుడు రాజస్థాన్లోనే కాదు.. హిమాచల్లోనూ కరెంటు కోతలు నిత్యకృత్యమయ్యాయి.
ప్రస్తుతం..
పొరుగురాష్ట్రం కర్ణాటక అసెంబ్లీకి ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ముంగిట కన్నడ ప్రజలకు ఐదు గ్యారెంటీలను మాటిచ్చిన కాంగ్రెస్.. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఆ హామీలను అమలు చేయలేక చతికిలపడింది. ఫలితంగా రాష్ట్రంలో గడిచిన ఆరునెలలుగా విద్యుత్తు సంక్షోభ మొదలైంది. కరెంటు లేక కటకటలాడుతున్నది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. కర్ణాటక కన్నా ఒకటెక్కువగా ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ఇక్కడ ప్రచారం చేస్తున్నది. అయితే గత కొద్దిరోజులుగా విద్యుత్తుపై కాంగ్రెస్ స్వరంలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. ‘తెలంగాణకు 24గంటల కరెంటు ఎందుకు? 5 గంటల కరెంటుచాలు’ అన్నట్టుగా కాంగ్రెస్ స్థానిక, కర్ణాటక, ఢిల్లీ నేతలు మాట్లాడుతున్నారు. మరి ఛత్తీస్గఢ్, హిమాచల్ ఉదంతాలను, విద్యుత్తును గుంజుకపోయి ఆయా రాష్ర్టాల్లో చీకట్లను నింపిన ఒప్పందాలను ఈ సందర్భంగా విద్యుత్తురంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇక్కడినుంచి కరెంటును కర్ణాటకకు తరలించి, తెలంగాణను బలిపెట్టాలని కాంగ్రెస్ చూస్తున్నదా అని వారు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. అదే జరిగితే.. ఇప్పటివరకూ 24 గంటల విద్యుత్తు వెలుగులను చూసిన తెలంగాణ.. ఒక్క పొరపాటుతో రోజూ చీకట్లలో మగ్గాల్సిందేనని వారు హెచ్చరిస్తున్నారు.
5 గంటల కరెంటు మస్తు!
మేము కర్ణాటకలో 24 గంటల కరెంటేమీ ఇవ్వడం లేదు. రైతులకు 5.. 6.. 7 గంటల కరెంటు ఇస్తున్నం.. వ్యవసాయానికి ఆ మాత్రం కరెంటు సరిపోతుంది. – డీకే శివకుమార్
3 గంటలు చాలు!
తెలంగాణలో ఎక్కువగా ఉన్నవి చిన్న కమతాలే. వ్యవసాయానికి ఒక గంటసేపు కరెంటు ఇస్తే ఒక ఎకరం పొలం తడుస్తది. కాబట్టి రాష్ట్రంలోని రైతులకు మూడునాలుగు గంటల కరెంటు సరిపోతుంది. కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్నట్టు 24 గంటల కరెంటు రైతులకు అవసరం లేదు. 3 గంటలు చాలు.
–రేవంత్
తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణదే రికార్డు