హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): ఏఐసీసీ గురువారం సాయంత్రం విడుదల చేసిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో తెలంగాణ నుంచి ఐదుగురికి చోటు దక్కింది. వీరిలో చేవెళ్ల నుంచి గడ్డం రంజిత్రెడ్డి, మల్కాజిగిరి నుంచి సునీతా మహేందర్రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, నాగర్కర్నూల్ నుంచి డాక్టర్ మల్లు రవి ఉన్నారు. ఇందులో మల్లు రవి తప్ప మిగతా నలుగురూ ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్లో చేరిన వారే కావడం గమనార్హం.
గడ్డం రంజిత్రెడ్డి బీఆర్ఎస్కు చెందిన సిట్టింగ్ ఎంపీ కాగా, దానం నాగేందర్ ఖైరతాబాద్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇక సునీతా మహేందర్రెడ్డి బీఆర్ఎస్కు చెందిన వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా ఖరారైన గడ్డం వంశీ గత అసెంబ్లీ ఎన్నికల ముందు తన తండ్రి, ప్రస్తుత చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి మారారు. మొదటి జాబితాలో నలుగురు, రెండో జాబితాలో ఐదుగురు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మరో ఎనిమిది స్థానాలను పెండింగ్లో పెట్టింది. హోలీ పండుగ తరువాత మిగతా అభ్యర్థులను ప్రకటిస్తామని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు తనకు అత్యంత ప్రతిష్ఠాత్మకమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. తన సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాల్సిందేనని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. గురువారం ఉదయం ఆయన సునీతా మహేందర్రెడ్డితో కలిసి నియోజకవర్గ పరిధిలోని ముఖ్యనేతలతో తన నివాసంలో సమావేశమయ్యారు. మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా మొదట ప్రచారం జరిగిన సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్రెడ్డి ఈ సమావేశానికి హాజరుకాకపోవడం గమనార్హం. సమావేశంలో రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. మల్కాజిగిరి నుంచి గత ఎన్నికల్లో తాను ఎంపీగా గెలుపొందడం వల్లనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేద్దామని చెప్పారు.
ఖమ్మం ఎంపీ టికెట్ను డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందినికి కేటాయించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. నాగర్కర్నూల్ టికెట్ను భల్లు భట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవికి కేటాయించడంతో అదే కుటుంబానికి చెందిన నందినికి అవకాశం ఇవ్వకపోవచ్చని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను విజయతీరాలకు చేర్చడంతో తన వంతు పాత్ర పోషించిన మల్లు భట్టివిక్రమార్క చివరి వరకు ముఖ్యమంత్రి పదవి కోసం గట్టిగానే ప్రయత్నించారు.
చివరకు రేవంత్రెడ్డి వైపు మొగ్గుచూపిన అధిష్ఠానం భట్టి విక్రమార్కను బుజ్జగించి, ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. తనకు ముఖ్యమంత్రి పదవి చేజారిపోయిన నేపథ్యంలో ఖమ్మం లోక్సభ నియోజకవర్గ టికెట్ను తన సతీమణి నందినికి ఇప్పించుకొనేందుకు భట్టి విక్రమార్క గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకొనే సందర్భంలో నందిని ఖమ్మం నుంచి హైదరాబాద్కు భారీ సంఖ్యలో కార్లతో ర్యాలీ నిర్వహించడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
మరోవైపు, ఖమ్మం జిల్లా రాజకీయాల్లో భట్టి విక్రమార్కను దెబ్బతీసేందుకు రేవంత్రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే ప్రయత్నించారనే ప్రచారమూ జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా మల్లు భట్టి విక్రమార్కకు చెక్ పెట్టేందుకు, చిన్నబుచ్చేందుకు రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాగర్కర్నూల్ టికెట్ను మల్లు రవికి కేటాయించడంతో భట్టి విక్రమార్క సతీమణికి చెక్ పెట్టినట్టయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాదరెడ్డికి మార్గం సుగమం అయిందని ఆయన వర్గం భావిస్తున్నది. ప్రస్తుతం ఖమ్మం టికెట్ పెండింగ్లో ఉండటంతో తన సతీమణికి టికెట్ ఇప్పించుకునేందుకు భట్టి విక్రమార్క ఏ వ్యూహం అనుసరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.