BJP | హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): దేశాన్ని ‘వికసిత్ భారత్’గా మార్చాలని తమ పార్టీ చూస్తుంటే, ‘విభజన భారత్’ కోసం కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఎంపీ కే లక్ష్మణ్ విమర్శించారు. తెలుగులో రూపొందించిన బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోను ఆదివారం రాష్ట్ర కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అనేక పథకాలు, కార్యక్రమాలను మ్యానిఫెస్టోలో పొందుపరిచినట్టు తెలిపారు.
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి, దేశ సమగ్రత, సమైక్యతను కాపాడటమే ధ్యేయంగా బీజేపీ సంకల్ప పత్రాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు 6 గ్యారెంటీలు వందరోజుల్లో అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తేనే హామీలు అమలు చేస్తామంటూ మరోసారి మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.