‘నీ కాల్మొక్త సారూ..సాగునీళ్లు ఇయ్యుండ్రి’..
– ఇది ధర్నాలో అడ్డుకున్న సీఐకి ఓ రైతు విజ్ఞప్తి.
‘సావనైనా సస్తాం.. నీళ్లిచ్చేదాకా కదలం’…
– ఇది వాహనాలకు అడ్డుపడ్డ మరో రైతు ఆవేదన.
కాంగ్రెస్ తెచ్చిన కరువుతో కండ్ల ముందే పంటలు ఎండుతుంటే అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. సాగునీళ్ల కోసం సర్కారుపై సమరం సాగిస్తున్నారు. రోజుకొక చోట రోడ్డెక్కుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు బోర్లు, ట్యాంకర్లు అద్దెకు తెచ్చుకుని అగచాట్లు పడుతున్నారు. పంటల పరిశీలనకు రాని ప్రభుత్వంపై ఆక్రోశం వెల్లగక్కుతూనే.. రైతులను వెతుక్కుంటూ వచ్చిన గులాబీ నాయకులను గుండెలకత్తుకుని గోడు చెప్పుకుంటున్నారు.
– నమస్తే తెలంగాణ, న్యూస్ నెట్వర్క్
నీళ్లు లేక పంటలు చేతికందే దశలో ఎండిపోతున్నాయని, వెంటనే చివరి ఆయకట్టుకు సాగునీళ్లు ఇవ్వాలని మంగళవారం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని పోచమ్మవాడ, మల్లేపల్లికి చెందిన రైతులు మంథని-గోదావరిఖని ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ విషయం తెలసుకున్న సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై వెంకటకృష్ణ ధర్నా స్థలానికి చేరుకొని రైతులను చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడే ఉన్న ఓ రైతు లేచి ‘సారూ.. నీ కాల్మొక్త మా రైతుల ధర్నాను విరమింపచేయొద్దు’ అని సీఐ కాళ్లు పట్టుకొని వేడుకొంటున్నాడు.
నీళ్లు లేక పంటలు చేతికందే దశలో ఎండిపోతున్నాయని, వెంటనే చివరి ఆయకట్టుకు సాగునీళ్లు ఇవ్వాలని మంగళవారం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని పోచమ్మవాడ, మల్లేపల్లికి చెందిన రైతులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సాగునీటి తండ్లాట మొదలైందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటు కన్నాల ప్రాజెక్టు నీరు అందక, అటు ఎసారెస్పీ, గుండారం రాక పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని వాపోయారు. పంటలకు సరిపడా సాగునీరు అందిస్తామని చెప్తేనే తాము పంటలు సాగుచేశామని, తీరా ఇప్పుడు సాగునీరు ఇవ్వకపోతే తాము అప్పుల పాలై రోడ్ల మీద పడాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీళ్లిచ్చే వరకూ ధర్నాను విరమించేది లేదని పట్టుబట్టారు.
– మంథని
పెద్దపల్లి పట్టణ జీవధార ఎల్లమ్మ గుండమ్మ చెరువు (మినీ ట్యాంక్బండ్) తూమును కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో రెండ్రోజులుగా నీరంతా వృథా పోతున్నది. ఈ విషయాన్ని తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్, సిబ్బంది మంగళవారం వచ్చి తూమును పరిశీలించి వెంటనే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. ఈ ఘటనపై ఇరిగేషన్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని, వారిపై చర్యలు తీసుకుంటారని తెలిపారు.
– పెద్దపల్లి
పంటలు చేతికందే దశలో నీరు లేక ఎండిపోతున్నాయని, వెంటనే సాగునీటిని విడుదల చేయాలని కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని కొండన్నపల్లి, రంగరావుపల్లి, తాడిజెర్రి గ్రామాల రైతులు మంగళవారం కరీంనగర్జగిత్యాల రహదారిలో కొండన్నపల్లికురిక్యాల మధ్య వరదకాలువ బ్రిడ్జిపై రాస్తారోకో చేశారు. మూడు రోజుల క్రితం సాగునీటి కోసం తాము ధర్నా చేయడానికి ప్రయత్నిస్తే నీటిని విడుదల చేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హామీ ఇచ్చారని, దీంతో తాము ధర్నా విరమించామని గుర్తు చేశారు. మూడు రోజులు గడుస్తున్నా.. నీరు విడుదల చేయకపోవడంతో మళ్లీ ఆందోళనకు దిగామని, వెంటనే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు.
– గంగాధర
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చిట్యాల రైతు కట్కూరు మల్లేశం తన ఏడెకరాల పొలంలో వరిపంట సాగుచేశాడు. నీళ్లు లేక పంట మొత్తం ఎండిపోయింది. దీనిని చూసి కన్నీటిపర్యంతమైన ఆ రైతు.. తన బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియక.. ఓ వీడియోలో సీఎం రేవంత్రెడ్డికి తన గోడును వెల్లబోసుకున్నాడు. ‘అయ్యా.. రేవంత్రెడ్డి పటేలా.. మీ పటేండ్ల పాలనలో పొలాలు ఎండుతున్నయి. నాకున్న ఎడెకరాల పొలంలో అంతా నాటేసిన. ఇప్పుడు నీవు నీళ్లియ్యకపోతివి.. నా పొలం ఎండిపోవట్టే.. రైతుబంధు ఇయ్యకపోతివి.. రుణమాఫీ చేయకపోతివి.. ఎప్పుడు చేస్తవు పటేలా? మీ.. పాలన గిట్లుంది. ఏంది? రైతులం ఉండాల్నా.. సావాల్నా? ఇగో వరి చూడు.. మా కేసీఆర్ ఉన్నప్పుడు ఫుల్లు నీళ్లు వచ్చేవి. ఫుల్లుఫుల్లుగా పొలాలు పారేది’ అంటూ తన వరి పొలాన్ని చూపిస్తూ ఆవేదన వెలిబుచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
– చేర్యాల
పంటలెండిన రైతుల బాధలు చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నదని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు సచ్చిపోతున్నా కాంగ్రెస్ సర్కార్ స్పందించడం లేదని మండిపడ్డారు. అన్నమో రామచంద్రా.. అంటూ అర్థిస్తున్నా కనికరించడం లేదని ధ్వజమెత్తారు. రైతులను ఆదుకోకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్పేటలో ఎండిన పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణుతో కలిసి పరిశీలించారు. బైక్పై పర్యటిస్తూ ఎండిన ప్రతి పంటనూ పరిశీలించి, ప్రతి రైతును కలిసి వారి బాధలను విన్నారు.
– రాజన్న సిరిసిల్ల, నమస్తే తెలంగాణ
కాంగ్రెస్ పాలనలో అన్నదాతకు సాగునీటి కష్టం వచ్చింది. చేతికందే దశలో పంటలు కండ్లముందే ఎండిపోతుంటే.. వాటిని కాపాడుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట రైతు కంటెరెడ్డి రెండెకరాల భూమి కౌలుకు తీసుకొని వరిసాగు చేశాడు. నీళ్లు రాక పంట ఎండిపోతుంటే.. చూడలేక ట్యాంకర్ల ద్వారా నీటిని పారిస్తున్నాడు. ఇప్పటికే పెట్టుబడికి రూ.1.50 లక్షలు వెచ్చించానని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటకు కావాల్సిన నీటిని కొనుగోలు చేసే దుర్భర స్థితి వచ్చిందని వాపోయాడు.
– చందుర్తి
రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. కాంగ్రెస్ వందరోజుల పాలనలో 180 మంది రైతుల ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని బట్టనవానికుంటలో ఎండిపోయిన వరి పొలాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బడుగుల మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని వరి పొలాలు ఎండిపోయినట్టు ఆరోపించారు. ఎండిన పంటలకు ఎకరానికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
– నేరేడుచర్ల