జనగామ, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): జనగామ కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్రెడ్డి బ్రాహ్మణ కులస్థులను మోటు మాటలతో అవమానించారు. రాయడానికి వీలులేని భాషలో నోరు పారేసుకున్నారు. బ్రాహ్మణులను నానా దుర్భాషలాడుతూ ఊగిపోయారు. జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి తరపున జనగామ పార్టీ ఎన్నికల ఇన్చార్జిగా భరత్కృష్ణ వ్యవహరిస్తున్నారు.
పట్టణ ఇన్చార్జిగా ఉన్నందున ఆయన తన ఓటు హక్కును ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జనగామలో నమోదు చేసుకున్నారు. దీనిని సహించలేని కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్రెడ్డి.. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన భరత్కృష్ణకు ఫోన్ చేసి పచ్చి బూతులు తిడుతూ కులం పేరుతో దూషించారు. బ్రాహ్మణులను కించపరుస్తూ కొమ్మూరి ప్రతాప్రెడ్డి చేసిన వ్యాఖ్యల ఆడియో బయటకు రావడంతో జనగామ నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది.
ఈ ఆడియోను విన్న బ్రాహ్మణ కులస్థులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ‘జనగామలో ఎక్కడ ఉన్నావో చెప్పు.. దమ్ముంటే అడ్రస్ చెప్పురా.. నీ దగ్గరకు వచ్చి నీ అంతు చూస్తా..’ అంటూ రాయడానికి వీలులేని మరికొన్ని బూతు మాటలతో కొమ్మూరి ప్రతాప్రెడ్డి ఊగిపోయారు. కొమ్మూరి నోటి దురుసుపై భరత్కృష్ణ జనగామ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి బుధవారం రాత్రి ఫిర్యాదు చేశారు. కొమ్మూరి ప్రతాప్రెడ్డి తనను తీవ్ర పదజాలంతో దుర్భాషలాడిన ఆడియో రికార్డు సీడీని ఎన్నికల అధికారులకు అందజేశారు. ఈ ఫిర్యాదును జనగామ అర్బన్ సీఐకి బదిలీ చేస్తామని రిటర్నింగ్ అధికారి తెలిపారు.