హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల రాజకీయం క్రమంగా వేడెక్కుతున్నది. పోలింగ్ తేదీ సమీపిస్తుండంతో పార్టీలు ప్రచారాన్ని ముమ్మరంచేశాయి. దీనికితోడు ప్రలోభాలకు కూడా తెరలేపాయి. కాంగ్రెస్ (Congress) పార్టీ అభ్యర్ధి శ్రీధర్ బాబు ఫొటోతో ఉన్న గోడగడియారాలు మంథనిలో పట్టుబడగా, హైదరాబాద్లోని రామంతాపూర్లో (Ramanthapur) అదే పార్టీకి చెందిన చెన్నూరు (Chennur) అభ్యర్థి గడ్డం వివేక్కు (Gaddam Vivek) చెందిన నగదును పోలీసులు పట్టుకున్నారు. గురువారం ఉదయం రామంతాపూర్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ బైక్పై వెళ్తున్న ఇద్దరిని ఆపారు. వారివద్ద బ్యాగ్లో చూడగా రూ.50 లక్షలు బయటపడ్డాయి. వారిని ముదిగంటి ప్రేమ్ కుమార్, కంజుల రవి కిషోర్గా గుర్తించారు.
ప్రేమ్ కుమార్ చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ చెందిన దిన పత్రికలో మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తుండగా, రవి కిషోర్ విశాఖ ఇండస్ట్రీస్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ అని తేలింది. తమ ఓనర్ వివేక్ ఆదేశాల మేరకు చెన్నూరు నియోజకవర్గంలో ఎన్నికల ఖర్చుల నిమిత్తం డబ్బును తరలిస్తున్నామని నిందితులు ఒప్పుకున్నారు. ఈ మేరకు వారిపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదుచేశారు. వారి నుంచి నగదుతోపాటు రెండు మొబైల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు.