Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): ‘ఈసారి లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు మేమే గెలుస్తాం’.. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు చేస్తున్న భీకర ప్రకటనలు ఇవి. సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన ఆ జాతీయ పార్టీలకు పోటీలో దిగేందుకు అభ్యర్థులు కూడా కరువయ్యారు. అందుకే బీఆర్ఎస్ తయారు చేసిన, బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థులను గుంజుకొని మరీ టికెట్లు ఇస్తున్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండగా, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. అయినా లోక్సభ నియోజకవర్గాలకు పోటీ చేసే స్థాయి నేతలు లేని దుస్థితిలో అవి కొట్టుమిట్టాడుతున్నాయి. అందుకే రెండు పార్టీలూ బీఆర్ఎస్ మీదపడ్డాయి.
17 లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే 10 నియోజకవర్గాల్లో జాతీయ పార్టీల తరఫున బీఆర్ఎస్ నుంచి చేర్చుకున్న నేతలే బరిలో ఉన్నారు. అంటే.. దాదాపు 60 శాతం నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలు, ఆ పార్టీ మాజీ నేతల మధ్యే పోటీ నెలకొన్నదన్నమాట. వరంగల్లో పరిస్థితి మరీ విచిత్రం. అక్కడ బీజేపీ నుంచి ఆరూరి రమేశ్, కాంగ్రెస్ నుంచి కడియం కావ్య బరిలో ఉన్నారు. వీరిద్దరూ బీఆర్ఎస్ నుంచి వెళ్లిన నేతలే. అంటే అక్కడ పోటీ మూడు పార్టీల మధ్య కాకుండా.. బీఆర్ఎస్లో కలిసి మెలిగిన నేతల మధ్యే పోటీగా తయారైందని రాజకీయ విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు. ఇలాంటి పార్టీలు మెజార్టీ సీట్లు ఎలా సాధిస్తాయని వారు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ గాలివాటంగా అధికారంలోకి వచ్చిందని మొదటి నుంచీ విమర్శలు ఉన్నాయి. తమది గాలివాటు విజయం కాదని.. ప్రజాభిమానం ఉన్నదని లోక్సభ ఎన్నికల్లో నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నది. అందుకే ఈసారి 14 సీట్లు గెలుస్తామని సీఎం రేవంత్రెడ్డి పదే పదే చెప్పుకుంటున్నారు. వాస్తవ పరిస్థితిని చూస్తే అనేక చోట్ల కనీసం పోటీ చేసేందుకు కూడా అభ్యర్థులు దొరకని పరిస్థితి. అందుకే ‘అరువు’ నేతల కోసం బీఆర్ఎస్ వైపు చూసింది. ఇప్పటివరకు 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే.. అందులో ఐదుగురు బీఆర్ఎస్ నుంచి వెళ్లిన నేతలే పోటీలో ఉన్నారు. సికింద్రాబాద్లో ఏకంగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు టికెట్ ఇచ్చే దుస్థితికి దిగజారిందని విశ్లేషకులు సైతం కాంగ్రెస్ వైఖరిపై మండిపడుతున్నారు.
వరంగల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్యను తమ పార్టీలో చేర్చుకొని మళ్లీ అదే స్థానంలో బరిలోకి దింపింది. చేవెళ్ల అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి, మల్కాజిగిరి నుంచి బరిలో ఉన్న పట్నం సునీతా మహేందర్రెడ్డి తాజాగా పార్టీలో చేరగా, పెద్దపల్లి అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తండ్రి గడ్డం వివేక్ అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ మారారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీఎస్పీ అంటూ కుర్చీలాట మాదిరిగా పార్టీలు మారిన నీలం మధుకు మెదక్ టికెట్ ఇచ్చింది. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్లో ఇంకా ఊగిసలాట కొనసాగుతున్నది. ఆయా స్థానాల్లో నేతలు ఎవరైనా వస్తారేమో అనే ప్రయత్నాలు చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
బీజేపీ నేతలు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా.. రాష్ట్రంలో కిషన్రెడ్డి, బండి సంజయ్, అర్వింద్ వంటి ముగ్గురు నలుగురికి మించి ప్రజల్లో గుర్తింపు ఉన్న నేతలు లేరన్నది వాస్తవం. అందుకే ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకోవడాన్ని నిరంతర ప్రక్రియగా ఆ పార్టీ కొనసాగిస్తున్నది. ఇప్పుడు బీజేపీలో కీలక స్థానాల్లో ఉండి, అభ్యర్థులుగా బరిలో ఉన్న ఈటల రాజేందర్, రఘునందన్రావు, కొండా విశ్వేశ్వర్రెడ్డి వంటి నేతలు బీఆర్ఎస్ నుంచి వెళ్లినవారే. ఈ లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా ఇందులో 6 స్థానాలు బీఆర్ఎస్ నుంచి అప్పటికప్పుడు వచ్చిన నేతలకే కేటాయించారంటే పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
నల్లగొండ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, జహీరాబాద్ బరిలో ఉన్న బీబీపాటిల్, వరంగల్ నుంచి ఆరూరి రమేశ్, మహబూబ్నగర్కు చెందిన సీతారాంనాయక్, ఆదిలాబాద్లో గోడెం నగేశ్, నాగర్కర్నూల్ అభ్యర్థి భరత్ రాత్రికి రాత్రే బీజేపీలో చేరి టికెట్ పొందినవారే. ఇలా సొంతంగా నేతలను తయారు చేసుకోలేని, కనీసం పోటీ చేసే స్థాయిలో బలమైన నేతలు లేని జాతీయ పార్టీలు రెండంకెల సీట్లు గెలుస్తామంటూ పోటాపోటీగా ప్రకటనలు గుప్పిస్తుండాన్ని రాజకీయ విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు. ముందుగా నేతలను తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు.