హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కాంగ్రెస్, బీజేపీ బరితెగిస్తున్నాయి. ప్రజల్ని గందరగోళానికి గురిచేయడమే లక్ష్యంగా మైండ్గేమ్ మొదలుపెట్టాయి. ఈ ఎన్నికల్లో మహాకూటమి అనేదే లేదు. దీనిని బట్టే ఇది తప్పుడు ప్రచారం అని స్పష్టమవుతున్నది.
తేదీలతో దొరికిపోయిన కాంగ్రెస్
సర్వే ఫలితాలపై తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ తేదీలతో అడ్డంగా దొరికిపోయింది. తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ ఖాతాలో పోస్టుచేసిన ఈ సర్వే వివరాల ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని పేర్కొంది. సరిగ్గా ఇక్కడే ఆ పార్టీ దొరికిపోయింది. దానిపై తేదీని మార్చడం మర్చిపోయింది. 10 నవంబర్ 2018న సర్వే విడుదలైనట్టు ఆ నివేదికపై ఉంది.
ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యం
రాష్ట్రంలో కాంగ్రెస్కు మరోమారు ఓటమి తప్పదని తేలిపోవడంతో ఆ పార్టీ ఇక దింపుడు కల్లం ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే అనేక అలవిగాని హామీలను ఇచ్చినా ప్రజలు పట్టించుకోవడం లేదు. బీఆర్ఎస్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నది.
విశ్వసనీయత లేని సీ-ఓటర్ సర్వే
సీ-ఓటర్ సర్వే పేరుతో సోషల్ మీడియాలో తిరుగుతున్న సర్వేను ప్రజలు విశ్వసించడం లేదు. గత ఎన్నికల్లో ఈ సంస్థ ప్రకటించిన ఎగ్జిట్పోల్ ఫలితాలు తలకిందులయ్యాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 58 సీట్లు, కాంగ్రెస్కు 45 సీట్లు వస్తాయని పేర్కొంది. ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా వచ్చాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ చేతిలో కాంగ్రెస్ చావుదెబ్బ తిన్నది. బీఆర్ఎస్ ఏకంగా 88 సీట్లతో అఖండ విజయం అందుకోగా, కాంగ్రెస్ 19 సీట్లతో సరిపెట్టుకున్నది. ఈ లెక్కన చూసుకుంటే ఈసారి కూడా బీఆర్ఎస్దే విజయమని తేలిపోయింది.
సీ ఓటర్ సర్వే బూటకం: బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్
దొంగ సర్వేలు, తప్పుడు ప్రచారాలతో కాంగ్రెస్, బీజేపీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. బాధ్యతలేని ఈ పార్టీలకు కర్రుకాల్చి వాతపెట్టి తెలంగాణను కాపాడుకోవాలంటే కేసీఆర్ లాంటి నాయకుడు మరోమారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. పదేండ్లుగా సాధించిన అభివృద్ధి, విజయాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రజలపై నమ్మకంతో సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. రాష్ట్రంలో గెలుపు వాతావరణం కనిపిస్తున్నది. మానవత్వం, ఆధునికత కలబోతే సీఎం కేసీఆర్. అలాంటి మహానాయకుడు మూడోసారి సీఎం అయితే అభివృద్ధి ఫలాలన్నింటినీ స్థిరీకరిస్తారు.