వేల్పూర్/కమ్మర్పల్లి, జూలై 22: సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ప్రపంచమే ఆశ్చర్యపోయిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. అతిపెద్ద మల్టీ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇంత తక్కువ కాలంలో ఎలా సాధ్యమైందని ప్రపంచ దేశాలు నివ్వెరపోయాయని అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో జరిగిన కార్యక్రమంలో కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ గ్రామానికి చెందిన 200 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంత్రి వేముల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 300 కిలోమీటర్ల కింద ఉన్న కాళేశ్వర జలాలు ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా ఎదురెక్కించిన అద్భుత సృష్టికర్త కేసీఆరేనని కొనియాడారు.
నమ్మితే మళ్లీ గోసపడతం
పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి రైతులకు 3 గంటల కరెంట్ చాలని మాట్లాడిన దానిపై రైతులు ఆలోచన చేయాలని ప్రశాంత్రెడ్డి సూచించారు. కాంగ్రెస్ పాలన నాటి కరెంట్ కష్టాల రోజులు మళ్లీ కావాలా? అని ప్రశ్నించారు. మోసపోతే గోస పడతామని హెచ్చరించారు. ఇప్పటికే బాండ్ పేపర్ రాసిచ్చి ఎంపీగా గెలిచిన అర్వింద్ ముఖం చాటేసిండని, పసుపుబోర్డు లేదు, మద్దతు ధర లేదని, అడిగితే ఆంబోతు లెక్క ఎగిరిపడుతున్నడని అన్నారు. రైతులు మరోసారి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో విస్తృత చర్చ జరిగేలా చూడాలని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. సంక్షేమ పథకాలు పొందుతున్న ప్రతి గడప కేసీఆర్ ప్రభుత్వానికి మద్దతు నిలిచేలా చొరవ తీసుకొవాలని పిలుపునిచ్చారు.