హనుమకొండ, జూన్ 3: హనుమకొండ అంబేద్కర్నగర్ వద్ద డబుల్ బెడ్రూం బాధితులు ఆందోళన చేపట్టారు. తమకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లను తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సాయంత్రం తాళాలు పగులగొట్టి ఇంటి లోపలికి వెళ్లారు. అక్కడే వంట చేసుకుని పడుకొన్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గత ప్రభుత్వం 2015లోనే అంబేద్కర్నగర్లో 53 మందికి, జితేందర్నగర్లో 64 మందికి ప్రొసీడింగ్స్ ఇచ్చినా అధికారులు ఇప్పటివరకు ఇండ్లు కేటాయించలేదని ఆగ్రహంవ్యక్తంచేశారు.
పదేళ్లుగా గుడిసెల్లో చెత్త డంపింగ్ యార్డు పక్కన ఉంటున్నామని ఆవేదన వెలిబుచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే అర్హులైన నిరుపేదలకు ఇళ్లు ఇస్తామని చెప్పి, ఇవ్వడం లేదని వాపోయారు. సుబేదారి పోలీసులు చేరుకొని బాధితులతో మాట్లాడినా వినకుండా అధికారులు, ఎమ్మెల్యే వచ్చే వరకు ఇక్కడే ఉంటామని భీష్మించుకొని కూర్చున్నారు. బుధవారం నుంచి మరింత ఉధృతం చేస్తామని స్పష్టంచేశారు.