Dalith Bandhu | కరీంనగర్/నల్లగొండ, జనవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దళితబంధు పథకం అమలులో జాప్యంపై దళితలోకం ఆందోళన చెందుతున్నది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల గడుస్తున్నా రెండో విడత డబ్బులను విడుదల చేయకుండా జాప్యం చేస్తున్నదని లబ్ధిదారులు మండిపడుతున్నారు. వ్యాపారాలు కొనసాగించాలా? లేదా? అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్న లబ్ధిదారులు.. ఈ విషయంపై తేల్చుకునేందుకు సోమవారం హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో కరీంనగర్ కలెక్టరేట్లోని ప్రజావాణికి తరలివచ్చారు. తమకు రెండో విడత నిధులు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలంటూ అధికారులను ప్రశ్నించడంతో చాలా సేపు గందరగోళం నెలకొన్నది. దళితబంధు సాధన కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండ కలెక్టరేట్ వద్ద లబ్ధిదారులు దీక్షకు దిగారు. ఇదే పరిస్థతి రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తున్నది.
దళితబంధు నిధుల విడుదలపై కాంగ్రెస్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నదని, వినతిపత్రం ఇచ్చినా స్పందించడం లేదని కరీంనగర్ ప్రజావాణిలో లబ్ధిదారులు మండిపడ్డా రు. నిర్దిష్ట గడువులోగా తమకు మంజూరైన నిధులు వెంటనే విడుదల చేయాలని, లేకుం టే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ విజయ కలెక్టరేట్కు చేరుకొని లబ్ధిదారులకు మద్దతుగా నిలిచారు. కేవలం వాహనాలు కొనుగోలు చేసిన వారికి మాత్ర మే పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేశారని, ఇతర వ్యాపారాలు చేస్తున్న వారికి ఒక్క విడత మాత్రమే నిధులు విడుదల చేశారని చెప్పారు. వీరి ఖాతాలో ఉన్న రూ.5 లక్ష లు కూడా ఫ్రీజ్ చేయడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. తక్షణమే రెండో విడత నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నల్లగొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 1,100 మంది నిరుపేద దళితులను ఎంపిక చేసి ప్రొసీడింగ్స్ ఇచ్చినందున వారికి దళితబంధు యూనిట్లను మంజూరు చేస్తూ గ్రౌండింగ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండ కలెక్టరేట్ వద్ద దళితబంధు సాధన కమి టీ చేపట్టిన నిరసన దీక్షలో ఆయన మాట్లాడా రు. ఏ ప్రభుత్వమైనా ఒక చట్టం చేస్తే ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం దానిని అమలు చేయాలని దళితబంధు సాధన కమిటీ కన్వీనర్ పాలడుగు నాగార్జున అన్నారు.
దళితబంధు పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన హుజూరాబాద్లో మొత్తం 18,021 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.9.90 లక్షల చొప్పున కేసీఆర్ ప్రభుత్వం జమచేసింది. అందులో 8,148 మందికి రెండో విడత డబ్బులు రావాల్సి ఉన్నది. ఈ డబ్బుల కోసం లబ్ధిదారులు అధికారులకు గతంలోనే కొటేషన్లు సమర్పించారు. వాటిని క్లస్టర్ అధికారులు పరిశీలించి ఎస్సీ కొర్పొరేషన్ ఈడీకి అందజేశారు. ఆ మేరకు నిధులు లబ్ధిదారులకు విడుదల చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం పూనుకొన్న సమయంలోనే.. ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయా యి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజలైన నేపథ్యంలో చాలా మంది లబ్ధిదారులు ఇప్పటికే హైదరాబాద్ వెళ్లి ప్రజాభవన్లో దరఖాస్తులు సమర్పించారు. అయినా పరిష్కారం కాకపోవడంతో సోమవారం కలెక్టరేట్ ప్రజావాణికి తరలివచ్చారు.
హుజూరాబా ద్ అసెంబ్లీ సెగ్మెం ట్లో 18వేల పైచిలుకు మందికి దళితబంధు పథకం అమలు చేసిన్రు. వీరిలో ఇంకా ఎనిమిదివేల మందికి రెండో విడత నిధులు విడుదల కాలేదు. కేవలం వాహనాలు తీసుకున్న వారికి మాత్రం మంజూరు చేసిన్రు. వ్యాపారాలు ఏర్పాటు చేసుకున్న వారికి జమచేయలేదు. ఎన్నికల అనంతరం రెండో విడత మొత్తం వస్తుందనే ధీమాతో అప్పులు తెచ్చి వ్యాపారాలు చేస్తున్నం. కొత్త ప్రభుత్వం ఏర్పాటై నెల గడిచినా నిధుల విడుదలపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయడం లేదు. పైగా మా ఖాతాల్లోని డబ్బులు ఫ్రీజ్ చేసిన్రు.
– మంద రాజేశ్, దళితబందు లబ్ధిదారుడు (జమ్మికుంట)
అధికారుల వైఖరితోనే మాకు దళితబంధు రెండో విడ త డబ్బులు జమకావడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం నాకు 5 లక్ష లు విడుదల చేసింది. రెండో విడత కోసం ఈడీ ఆఫీస్ చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా స్పందన లేదు. దళితుల అభ్యున్నతి కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని నీరుగార్చుతారేమోననే అనుమానం వస్తున్నది. దళితబంధును ఇలాగే సాగనివ్వాలి. లేకుంటే దళితుల నుంచి వ్యతిరేకత తప్పదు.
– కొలుగూరి నరేశ్, దళితబంధు లబ్ధిదారుడు (జమ్మికుంట)