జగిత్యాల కలెక్టరేట్, అక్టోబర్ 9: జగిత్యాల పట్టణంలో ఇండ్లు లేని నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి, అర్హులను ఎంపిక చేసి జాబితా తయారు చేస్తే.. వాటిలో కంప్యూటర్ ఆపరేటర్, మీసేవా నిర్వాహకుడు కలిసి అక్రమాలకు పాల్పడ్డారు. ఇండ్ల కేటాయింపులో అర్హుల పేర్లను మార్చి.. ఇతర మండలాలకు చెందిన వారి నుంచి డబ్బులు దండుకుని అనర్హులను జాబితాలో చేర్చారు. అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేసి ఇద్దరిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ వెంకటస్వామి సోమవారం జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
జగిత్యాల పట్టణంలో ఇండ్లు లేనివారి కోసం జగిత్యాల అర్బన్ కాలనీలో కేసీఆర్నగర్ పేరుతో ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. అర్హుల జాబితా రూపొందించి క్యాటగిరీల వారీగా లాటరీ తీసి లబ్ధిదారులను ఎంపిక చేసింది. అయితే.. లబ్ధిదారుల జాబితా రూపొందించే క్రమంలో కలెక్టరేట్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న బోగ రాకేశ్, బీర్పూర్లో మీసేవ నిర్వాహకుడు చంద్రశేఖర్ కుమ్మక్కయ్యారు. బీర్పూర్, సారంగాపూర్, జగిత్యాల పట్టణానికి చెందిన 57 మంది వద్ద రూ.5 వేల నుంచి రూ.60 వేల వరకు డబ్బులు తీసుకుని అర్హుల స్థానంలో వారి పేర్లను జాబితాలో చేర్చారు. దీంతో అన్ని అర్హతలూ ఉన్న లబ్ధిదారులకు ఇండ్లు రాలేదని పలువురు కౌన్సిలర్లు అభ్యంతరం చెప్పారు. ఈ మేరకు స్పెషలాఫీసర్ హౌసింగ్ డీఈ రాజేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కంప్యూటర్ ఆపరేటర్ బోగ రాకేశ్, మీ సేవ నిర్వాహకుడు చంద్రశేఖర్ అక్రమాలకు పాల్పడినట్టు దర్యాప్తులో తేలింది. వారిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ వెంకటస్వామి తెలిపారు.