హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సర్కారు బడులు డిజిటల్ ఎడ్యుకేషన్ దిశగా అడుగులేస్తున్నాయి. ఇదే కోవలో తాజాగా 2 వేలకు పైగా ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నారు. ఆయా బడుల్లో ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ ల్యాబ్లను నెలకొల్పనున్నారు. ఒక్కో బడికి 8 నుంచి10 వరకు కంప్యూటర్లను అందజేస్తారు. ఆయా కంప్యూటర్ల సేకరణకు ఇటీవలే టెండర్ల ప్రక్రియను పూర్తిచేశారు. ఒప్పందం కుదుర్చుకొన్న తర్వాత 4 వారాల్లో వీటిని బడులకు అందజేయాలని అధికారులు సూచించారు. వీటి ద్వారా డిజిటల్ తరగతులను బోధించవచ్చని అధికారులు చెప్తున్నారు.
సర్కారు బడుల రూపురేఖలు మార్చేందుకు రాష్ట్రంలో ‘మన ఊరు మన బడి – మన బస్తీ మన బడి’ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో డిజిటల్ విద్య అంశాన్ని కూడా చేర్చారు. 69,915 కంప్యూటర్ ల్యాబ్ టేబుళ్లు, కంప్యూటర్ ల్యాబ్ కుర్చీలను సేకరిస్తున్నారు. కంప్యూటర్ల ల్యాబ్ల ఏర్పాటుకు రూ. 120 కోట్ల నిధులను వెచ్చించనున్నారు. ఇప్పటికే బడుల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయగా, వీటి ద్వారానే కంప్యూటర్ ల్యాబ్లను నిర్వహించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.