కామారెడ్డి : స్వయంపాలన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల సమగ్రాభివృద్ధి సాధ్యమైందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గొర్రెలు, మేకలకు నట్టల మందు పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యే బాజుల సురేందర్, షీప్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి జీవితాల్లో కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం వెలుగులు నింపిందన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అందరికీ తెలిసినవేనన్నారు. గొల్ల కురుమలు అడుగక ముందే గొర్రెల పంపిణీ, మత్స్సకారులకు ఉచితంగా చేపపిల్లల పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
పరిపాలనలో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా దళితబంధు పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని మరిచి నేడు ప్రభుత్వంపై విమర్శలు సిగ్గుచేటన్నారు. ప్రధాని దేశానికి ఏం చేశారంటే.. రోజుకు ఐదుజతల బట్టలు మారుస్తారు.. తెలంగాణలో 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నాం.. మీ గుజరాత్లో ఇస్తున్నారా? ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే ధైర్యం మీకుందా? అంటూ మంత్రి సవాల్ విసిరారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ.1400కోట్లు ఇవ్వకుండా ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం బీజేపీ చేస్తుందని మండిపడ్డారు.