పరిగి, ఫిబ్రవరి 28: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఢిల్లీలో పొగిడే బీజేపీ నేతలు.. రాష్ట్రంలో మాత్రం తిడుతుంటారని పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను బీజేపీ, కాంగ్రెస్లు కాపీ కొడుతున్నాయని ఆరోపించారు. సోమవారం వికారాబాద్లో రూ.5.15 కోట్లతో చేపట్టిన వికారాబాద్ జిల్లాపరిషత్ నూతన భవన నిర్మాణానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడుతూ.. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధితో రాష్ర్టానికి పెద్దఎత్తున అవార్డులు వస్తున్నాయని, ఢిల్లీలో ఇచ్చే అవార్డులు మోయలేకపోతున్నామని అన్నారు. వికారాబాద్ జిల్లాలోని ప్రతి జడ్పీటీసీకి అభివృద్ది పనుల కోసం 15 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా పరిషత్, మండల పరిషత్తులకు ప్రభు త్వం 500 కోట్లు మంజూరు చేసిందని వివరించారు. అర్హులందరికీ త్వరలో కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్టు స్పష్టంచేశారు. ‘పాలమూరు-రంగారెడ్డి’ పూర్తి చేసి జిల్లాలోని ప్రతి ఎకరాకు నీరిచ్చేందుకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ పీ సునీతారెడ్డి, చేవెళ్ల ఎంపీ జీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ పీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.